హైదరాబాద్, సెప్టెంబర్ 17 ( నమస్తే తెలంగాణ ): రాష్ట్రప్రభుత్వ పారదర్శక విధానాలతో ఉపాధి హామీ పథకంలో అవినీతి గణనీయంగా తగ్గింది. కరోనా ప్రభావంతో పట్టణాల్లోని ప్రజలు చాలామంది సొంత ఊర్లకు వెళ్లి ఉపాధి పనుల్లో చేరటంతో కూలీల సంఖ్య భారీగా పెరిగింది. దాంతో కూలీల లెక్కింపు, ఊపాధి డబ్బు పంపిణీలో అక్రమాలు జరుగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకొన్నది. పనుల బాధ్యతను గ్రామ కార్యదర్శులకు అప్పగించింది. పైస్థాయి అధికారుల పర్యవేక్షణ కూడా పెరిగింది. దాంతో పనుల్లో అక్రమాలు చాలావరకు తగ్గాయని సామాజిక తనిఖీల్లో వెల్లడయ్యింది. రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో 15.80 కోట్ల పనిదినాలను కల్పించారు. నిర్దేశిత పనిదినాలకంటే ఇవి 3.80 కోట్లు అధికం. కరోనా సమయంలో లక్షన్నర మందికిపైగా కొత్తగా జాబ్ కార్డులు తీసుకొన్నారు. మరికొందరు ఇప్పటికే ఉన్న కార్డులో అదనంగా పేర్లను చేర్చుకొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర నిర్దేశించిన 13 కోట్ల పనిదినాలను పూర్తిచేసి, అదనంగా మరికొన్ని పనిదినాలు మంజూరు తీసుకొనేలా కార్యాచరణ అమలుచేస్తున్నారు.
వలసలతో అవినీతి..
కరోనాకు ముందు గ్రామాల నుంచి చాలామంది ఉపాధి జాబ్కార్డులున్నవారు పట్టణాలకు మెరుగైన ఉపాధి కోసం వలస వచ్చేవారు. వారు పట్టణాల్లో ఉన్నా, గ్రామాల్లో ఉపాధి పనులకు హాజరైనట్టుగా కార్డుపై నమోదు చేసేవారు. ఇలా ఎక్కువ శాతం నిధులు దుర్వినియోగమయ్యేవి. దీంతోపాటుగా తక్కువ విలువైన పనికి ఎక్కువ విలువ చూపిస్తూ రికార్డులు మార్చేవారు. సామాజిక తనిఖీల్లో ఇలాంటి అక్రమాలు బయటపడితే దుర్వినియోగమైన నిధులను బాధ్యుల నుంచి వసూలు చేయటంతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకొనేవారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 432 మండలాల్లో, 2019-20 లో 346 మండలాల్లో, 2020 డిసెంబర్ 2021 మార్చి వరకు 113 మండలాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించారు. 2021 ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో తనిఖీలు కొనసాగిస్తున్నారు.