స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సముద్ర తీర ప్రాంత రాష్ర్టాల్లో ఎండుచేపల కల్లాలు (ఫిష్ డ్రైయింగ్ యార్డ్స్) ఏర్పాటుకు ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం వర్తింపజేసింది. ఎండు చేపల కల్లాల ఏర్పాటు వల్ల మత్స్యకారులతో పాటు ఇతరుల జీవనోపాధికి దోహదం చేస్తుందని కేంద్రం ఆలోచన. అయితే, సముద్ర తీర ప్రాంతం లేని తెలంగాణ వంటి రాష్ర్టాల్లో రైతులు, రైతు కూలీలకు ప్రధాన జీవనాధారం వరి సాగు మాత్రమే.
పండించిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే మార్కెట్కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వరి ధాన్యాన్ని ఎండబెట్టే కల్లాలకు ఉపాధి హామీ ఎందుకు వర్తింపజేయటం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎండు చేపల కల్లాల ఏర్పాటుకు వర్తించే పథకం.. వరి కల్లాలకు చెందుకు వర్తించదని తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రాన్ని నిలదీస్తున్నది. ఎండు చేపల కల్లాల నిర్మాణానికి ఒక యూనిట్కు రూ.75 వేలుగా ఖరారు చేసింది.
ఈ పథకాన్ని గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలకు వర్తింపజేసింది. ఈ రాష్ర్టాల్లోని 7,516 కిలోమీటర్ల తీర రేఖ వెంబడి ఉన్న వేల గ్రామాల్లో ఎండు చేపల కల్లాల నిర్మాణ పనులకు ‘ఉపాధి’ లభించింది. అలాంటప్పుడు వరి సాగు చేసే రైతులు కల్లాలు ఏర్పాటు చేసుకొనేందుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయకపోవటం తెలంగాణ వంటి రాష్ర్టాల పట్ల కేంద్రం వివక్ష చూపటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.