సుల్తాన్బజార్, సెప్టెంబర్ 19: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకుల యాజమాన్యాలు అక్రమ బదిలీలతో ఉద్యోగులను వేధిస్తున్నాయని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు మండిపడ్డారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులపై వేధింపులు, అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ఉద్యోగులు కోఠి బ్యాంక్ స్ట్రీట్ సెంట్రల్ బ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట సోమవారం ప్లకార్డులను ప్రదర్శిస్తూ సమ్మె చేపట్టారు.
ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. బ్యాంకింగ్ రంగంలో ఒప్పందాలకు విరుద్ధంగా సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలన్నారు. వికలాంగులు, మహిళలు, వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు ఇష్టారీతిన బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టాల ప్రధాన కార్యదర్శి పీ ఉదయ్, రీజినల్ సెక్రటరీ ఎస్వీఎస్ఎన్ మూర్తితోపాటు పెద్దసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.