హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మార్ఫింగ్ ఫొటోలతో ప్రధాని, ముఖ్యమంత్రి, వివిధ రాజకీయ నాయకులు, మహిళలపై అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తున్న మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్ ఉద్యోగులు ముగ్గురిని అరెస్టు చేసినట్టు సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు. సోషల్ మీడియాలో వివిధ పేర్లతో ఖాతాలు సృష్టించిన ఈ ముఠా కొంతకాలంగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో అసభ్యకర పోస్టులు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై హైదరాబాద్ సైబర్క్రైం ఠాణాతోపాటు మార్కెట్, చాంద్రాయణగుట్ట, రాంగోపాల్పేట్, అంబర్పేట్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. మాదాపూర్లోని మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్ సంస్థ కార్యాలయంలోని ఐపీ అడ్రసుల నుంచే ఈ పోస్టులు వస్తున్నట్టు నిర్ధారించుకున్న పోలీసులు.. మంగళవారం సాయంత్రం ఆ కార్యాలయానికి వెళ్లి, అక్కడ పనిచేస్తున్న మంద శ్రీప్రతాప్, శశాంక్, ఇషాన్ శర్మలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు వారికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. పట్టుబడిన ముగ్గురు సునీల్ కనగోలు అనే వ్యక్తి నేతృత్వంలోనే పనిచేస్తున్నారని, అతనిపైనా కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.
ఎవరూ కనిపెట్టలేరని..
‘తెలంగాణ గళం’, ‘భారత యువత’ పేరుతో సోషల్ మీడియాలో సునీల్ కనగోలు ఆధ్వర్యంలోని టీం అభ్యంతరకర పోస్టులు చేస్తున్నదని సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ అర్వింద్ తదితరుల ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన విధంగా మీమ్స్, వీడియోలు తయారు చేస్తున్నారని వివరించారు.
కాంగ్రెస్ రిట్పై నేడు విచారణ
కాంగ్రెస్ పార్టీ వార్ రూం నుంచి చట్టవ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టింగ్ పెడుతున్నారని పోలీసు కేసు నమోదు నేపథ్యంలో ఆ పార్టీ మాజీ ఎంపీ మల్లు రవి హైకోర్టును ఆశ్రయించారు. తమ పార్టీ ఆధ్యర్యంలో మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో వార్ రూం పేరిట నిర్వహించే కార్యాలయానికి పోలీసులు 13వ తేదీ రాత్రి 10.45 గంటలకు వచ్చి ముగ్గురిని తీసుకువెళ్లారని చెప్పారు. సిమ్లాకు చెందిన ఇషాన్ శర్మ, విశాఖకు చెందిన తాతినేని శశాంక్, విజయవాడకు చెందిన మండ ప్రతాప్లను కోర్టులో హాజరుపర్చేలా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరుపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. గురువారం విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది.