నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 8 : పులిచింతల ప్రాజెక్టులో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన 16వ గేటుకు ప్రత్యామ్నాయంగా అత్యవసర(స్టాప్లాగ్ ఎలిమెంట్స్) గేటు ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. దీంతో దిగువకు వెళ్తున్న నీరు నిలిచిపోగా, ప్రాజెక్టులో నీటిని నిలిపేందుకు అవకాశం ఏర్పడింది. కొట్టుకుపోయిన క్రస్ట్ గేట్ ప్రాజెక్టుకు 500 మీటర్ల దూరంలో కనిపించింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175.00 (45.77 టీఎంసీలు) అడుగులకు ప్రస్తుతం 137.958 (8.849 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నది. ఎగువ నుంచి 56,950 క్యూసెక్కుల నీరు వస్తుండగా, దిగువకు 8,509 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో స్పల్పంగా పెరుగుతున్నది. ఆదివారం సాయంత్రం 50,600 క్యూసెక్కులు ఇన్ఫ్లో, 40,268 క్యూసెక్కులు అవుట్ఫ్లో నమోదవుతున్నది. శ్రీశైలం జలాశయానికి 89,418 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. కుడి ఎడమగట్టు విద్యుదుత్పత్తి ద్వారా 65 వేల క్యూసెక్కులు సాగర్కు విడుదల చేశారు. నాగార్జున సాగర్కు 75,134 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 4 క్రస్ట్గేట్ల ద్వారా అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను ప్రస్తుతం 589.90 అడుగుల (311.7462 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో 59,280, అవుట్ఫ్లో 62,519 క్యూసెక్కులు నమోదైంది.