హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించి ఏటా 2లక్షల ఉద్యోగాలిస్తాం.. యువతకు నిరుద్యోగ భృతి అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మళ్లీ మోసం చేసింది. వరుసగా రెండేండ్ల నుంచి దగా చేస్తూ ప్రభుత్వం ఇప్పుడు మూడో ఏడాదిలోనూ అదే ఒరవడిని పునరావృతం చేసింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొత్త ఉద్యోగాల భర్తీ ప్రస్తావనే లేకపోగా, కొత్త ఉద్యోగాలకు కేటాయింపుల్లేవన్నట్టు ఉన్నది.
కొత్త ఉద్యోగాలకు వేతనాలెట్ల?
ఇప్పటివరకు 67,763 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించుకున్నది. కానీ రాబోయే సంవత్సరంలో ఎన్ని భర్తీ చేస్తామన్నది ప్రకటించలేదు. వాస్తవానికి కొత్త ఖాళీల భర్తీకి ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఇలా కేటాయిస్తేనే వేతనాలిచ్చే వీలుంటుంది. కానీ బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావించలేదంటే కొత్త కొలువుల భర్తీ అటకెక్కించినట్టేనని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. బడ్జెట్లో రూపాయి ఇవ్వకుండా కొత్త ఉద్యోగాలను ఎలా భర్తీచేస్తారు? ఒకవేళ భర్తీచేసినా వేతనాలెలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడున్న ఉద్యోగులకే వేతనాలివ్వలేక సర్కార్ సతమతమవుతున్నది. ఆర్బీఐ నుంచి అప్పు తెస్తేగానీ వేతనాలివ్వలేని పరిస్థితి ఉన్నదని చెబుతున్నారు. కొత్త కొలువుల భర్తీకి నయాపైసా కేటాయించలేదంటే ఉద్యోగాల భర్తీ లేనట్టేననే తెలుస్తున్నది.
గతి లేని భృతి
రాష్ట్రంలో 35లక్షల నిరుద్యోగులున్నారు. వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెలా రూ.4వేల నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని హామీ ఇచ్చింది. గత రెండు బడ్జెట్లలో కనీస ప్రస్తావనే లేదు. తాజాగా ఈ బడ్జెట్లోనూ భృతిపై ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 28నెలల్లో ఒక్కో నిరుద్యోగికి రూ.1.12 లక్షలు బాకీపడింది. ఇక రాజీవ్ యువవికాసం కింద రుణాలిస్తామని ప్రకటించినా ఎవరికీ ఇచ్చిన దాఖలాల్లేవు.
పబ్లిక్ స్కూళ్లకు రూ.500కోట్లు
బడ్జెట్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు ప్రభుత్వం రూ.500కోట్లు కేటాయించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీయట్ వరకు ఒకే క్యాంపస్లో విద్యాబోధన జరుగుతుంది. ఒక్కో స్కూల్లో 1,500మంది విద్యార్థులకు విద్యనందిస్తారు. అయితే ఇటీవలే విద్యాకమిషన్ వీటిపై సర్కార్కు ఓ నివేదిక సమర్పించింది. మొదటి విడుతలో 200 మండలాల్లో 400 పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నది. ఇందుకు రూ.6వేల కోట్లు కేటాయించాలని సిఫారసు చేసింది. అయితే సర్కారు రూ.500కోట్లు కేటాయించి మమ అనిపించింది.
విద్యాశాఖ పరిధిలోకి స్కిల్ యూనివర్సిటీ
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎవరి నియంత్రణలో ఉండాలన్న అంశంపై సర్కార్ స్పష్టతనిచ్చింది. ఈ వర్సిటీని విద్యాశాఖ పరిధిలోకి తెస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. మిగతా వర్సిటీలు విద్యాశాఖ పరిధిలో, ఈ ఒక్క వర్సిటీ పరిశ్రమల శాఖ పరిధిలో ఉండటంతో కోర్సుల నిర్వహణ, స్కిల్లింగ్ వంటి అంశాల్లో సమన్వయలేమి కనిపిస్తున్నది.