హైదరాబాద్/ మన్సూరాబాద్ ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) కేంద్రం సంఘం నూతన అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శిగా ఏనుగుల సత్యనారాయణ ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ఎన్నికల్లో సంఘం నూతన కార్యవర్గం కొలువుదీరింది. అసోసియేట్ అధ్యక్షుడిగా బీ శ్యామ్, ఉపాధ్యక్షుడిగా ఏ జగన్మోహన్రావు, సంయుక్త కార్యదర్శిగా ఏ పరమేశ్వర్రెడ్డి, కోశాధికారిగా ఎం ఉపేందర్రెడ్డి, మహిళా ప్రతినిధిగా జీ దీపారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మాచర్ల రామకృష్ణాగౌడ్, కార్యనిర్వాహక సభ్యుడిగా పంతంగి యాదగిరిగౌడ్, సలహాదారులుగా టీ రవీందర్రావు, జీ పురుషోత్తంరెడ్డి, వాంకుడోత్ సురేశ్ను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా ఎన్ రవి, సీహెచ్ సంపత్కుమార్లు వ్యహరించారు.
ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గెజిటెడ్ అధికారుల వేతన సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి న్యాయబద్దమైన డిమాండ్లను సాధించుకుంటామని తెలిపారు. పెండింగ్లో ఉన్న కరువు భత్యం బకాయిలను త్వరలో విడుదల చేయించుకోవడంతో పాటు పీఆర్సీ సాధనకై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. జీవో నంబర్ 317 ద్వారా దూర ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.
టీజీవో ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ చింతలకుంటలోని ప్రలవిగార్డెన్లో తొలుత కాస్త హైడ్రామా నెలకొన్నది. 15 మంది ఇంజినీర్లు పోటీచేసేందుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వెళ్లారు. దీంతో నిర్ధేశిత సమయం దాటిందన్న కారణంతో వీరి నామినేషన్లను స్వీకరించలేదు. ఏకగ్రీవం చేసేందుకే ఇలా చేస్తున్నారని పలువురు టీజీవో నేతలు ఆందోళనకు దిగారు. అంతా సద్దుమణిగాక ఆ కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు.