హైదరాబాద్: వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయడం సులభమేనని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అయితే దీనికోసం నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ గంగాధర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం పోత్సహిస్తున్నదని చెప్పారు. అయితే దీనికి ఈఆర్సీ నిర్ణయిస్తున్న రేట్లు ప్రతిబంధకాలుగా మారాయన్నారు. విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయించిన ధరలకు పొసగడం లేదని తెలిపారు.
పురపాలక సంఘాల్లో వ్యర్థాల నుంచి 38.40 వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. వ్యర్థలతో రోజుకు 0.38 మెగాయూనిట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. తద్వారా
సంవత్సరానికి 3 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను నివారించగలుగుతున్నామని పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటుచేశామన్నారు. కొత్తగా 90.05 మెఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టులకు దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు 76 మెఘావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు అనుమతించామని తెలిపారు.