హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): వచ్చే వేసవిలో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మరింత పెరగవచ్చని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మార్చి 29న విద్యుత్తు డిమాండ్ గరిష్ఠంగా 14,160 మెగావాట్లు ఉన్నదని, అందువల్ల వచ్చే ఎండాకాలంలో మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నామని అన్నారు. గత ఏడాది డిసెంబర్ రెండోవారంలో విద్యుత్తు వినియోగం 7800 నుంచి 9200 మెగావాట్ల మధ్య విద్యుత్తు డిమాండ్ ఉన్నదని, ఇప్పుడు అది 11,100 మె.వా.కు చేరుకున్నదని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ నెల రెండోవారంలో 7800 నుంచి 9200 మెగావాట్ల మధ్య విద్యుత్తు వినియోగమైందని, కానీ ఈ సారి 11,100 మె.వా. చేరిందని తెలిపారు.
ఈ ఏడాది భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటంతో రైతులు ముందస్తుగా వరి పంట సాగు చేస్తున్నారని, దీనివల్ల విద్యుత్తు డిమాండ్ పెరిగిందని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రూ.37,500 కోట్లతో విద్యుత్తు వ్యవస్థను పటిష్ఠం చేశామని తెలిపారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా ప్రభాకర్రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈహెచ్టీ వ్యవస్థలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని అన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 220 కేవీ సబ్ స్టేషన్లు 51 మాత్రమే ఉండేవని, ప్రస్తుతం అవి 99కి పెరిగాయని చెప్పారు. 137 ఈహెచ్టీ సబ్స్టేషన్లు నిర్మించినట్టు వివరించారు. ప్రస్తుతం 370 ఈహెచ్టీ సబ్స్టేషన్ల ద్వారా అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్తును అందిస్తున్నామని చెప్పారు.