హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): చేతికి ఐదు వేళ్లు ఉంటే చాలు. ఏ పని చేయాలన్నా వాటితో చేయొచ్చు. ఆ చేతికి ఆరో వేలు ఉన్నా.. అది ఎందుకూ పనికిరాదు. మిగతా ఐదు వేళ్లను పక్కనపెట్టి మొత్తం శక్తిని ఆరో వేలుకి ఇచ్చినా అది ఏమీ చేయలేదు. అలాగే ఏమాత్రం సంబంధం లేని సంస్థకు అధికారం అప్పగిస్తే మొత్తం వ్యవస్థే కుప్పకూలుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ పనిలోనే ఉన్నట్టు స్పష్టమవుతున్నది. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లో ఏ మాత్రం సంబంధం లేని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)కు విద్యుత్తు కొనుగోలు, అమ్మకాలపై అజమాయిషీని, అధికారాలను అప్పగించడం మోదీ సర్కార్కే చెల్లింది. విద్యుత్తు సంస్థలన్నింటినీ తన చెప్పుచేతల్లోకి తెచ్చుకొని రాష్ర్టాల అధికారాలను హరించడం, ఆపై విద్యుత్తు రంగాన్ని ప్రైవేటు పరం చేయడమే దీని లక్ష్యంగా కనపడుతున్నది.
విద్యుత్తు చట్టం-2003లో లేని ఎన్ఎల్డీసీ
మన రాష్ట్రంలోని డిస్కంలు కూడా విద్యుత్తు చట్టం-2003 ప్రకారమే విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (జెన్కో)లతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందాల్లో జెన్కోలు, డిస్కంలు మాత్రమే ఉంటాయి. మూడో సంస్థ ఉండదు. విద్యుత్తు బిల్లుల వసూలుపై జెన్కోలు, డిస్కంల మధ్య వివాదం తలెత్తితే.. విద్యుత్తు నియంత్రణ మండలికి, న్యాయస్థానాలకు వెళ్లే వెసులుబాటును కల్పించారు. ఇందులో ఎక్కడా కేంద్ర జోక్యానికి గానీ, ఎన్ఎల్డీసీ ప్రమేయానికి గానీ తావులేదు. పీపీఏలో కనీసం వాటి ప్రస్తావనకూడా ఉండదు. అయినా కేంద్రం ఎన్ఎల్డీసీని తెరపైకి తీసుకొచ్చింది.
గ్రిడ్ నిర్వహణ కోసమే ఎన్ఎల్డీసీ
నిజానికి ఎన్ఎల్డీసీ అనేది దేశవ్యాప్తంగా విద్యుత్తు గ్రిడ్లను సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాటుచేసిన సాంకేతిక సంస్థ మాత్రమే. గ్రిడ్ నిర్వహణతోపాటు, భద్రత, క్రమశిక్షణకు సంబంధించిన సాంకేతిక అంశాలను మాత్రమే ఎన్ఎల్డీసీ పరిశీలించాలి. అయితే, ఇక్కడే ఒక తిరకాసు ఉన్నది. ఎల్పీఎస్ రూల్స్-2022 ప్రకారం విద్యుత్తు కొనుగోలు, అమ్మకాలపై అజమాయిషీ, అధికారాలు చెలాయించడంపై ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని గ్రహించిన కేంద్రం.. తాజాగా ఈ రూల్స్ను విద్యుత్తు సవరణల బిల్లులో పొందుపచ్చింది. అంటే ఈ రూల్స్ను చట్టబద్ధం చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నదన్నమాట.
చట్టబద్ధత లేకున్నా..
ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. విపక్షాలు తీవ్ర నిరసన తెలపడంతో ఆ బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపింది. దీంతో విద్యుత్తు సవరణల బిల్లు ఇంకా చట్టంగా రూపొందలేదు. కానీ అందులో పొందుపర్చిన ఎల్పీఎస్ రూల్స్ను మాత్రం కేంద్రం అధికారయుతంగా అమలు చేస్తూ.. అజమాయిషీని ఎన్ఎల్డీసీకి కట్టబెట్టింది. తద్వారా చట్టబద్ధత లేని నిబంధనలు, సంస్థలతో రాష్ర్టాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నది. బిల్లులు చెల్లించలేదన్న కారణంంతో విద్యుత్తు కొనుగోలు, అమ్మకాలు చేయకుండా తెలంగాణతోపాటు 13 రాష్ర్టాలపై నిషేధం విధిస్తూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీచేయడం ఈ ప్రయత్నాల్లో భాగమే.
కేంద్రం దూరాలోచన
విద్యుత్తు రంగం కేంద్రం, రాష్ర్టాల సంయుక్త జాబితా (కాంకరెంట్ లిస్ట్)లో ఉన్నది. ఇందులో రాష్ర్టాలకే ఎక్కువ అధికారాలుంటాయి. అయినా విద్యుత్తు సంస్థలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసుకోవాలని కేంద్రం దురాలోచన చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే జెన్కోలకు డిస్కంలు సకాలంలో బిల్లులను చెల్లించడంలేదన్న సాకుతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొన్నది. ఎన్ఎల్డీసీకి పర్యవేక్షణ అధికారాలను కట్టబెడుతూ ఉత్తర్వులను జారీచేసింది. తాజాగా లేట్ పేమెంట్స్ సర్చార్జి (ఎల్పీఎస్) రూల్స్-2022ను రూపొందించింది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ నుంచి డిస్కంలు విద్యుత్తు కొనుగోలు చేయకుండా నిషేధం విధించడంతోపాటు దాన్ని అమలుచేసే అధికారాన్ని ఎన్ఎల్డీసీకి అప్పగించింది. అయితే గత ఏప్రిల్లో తెలంగాణ విద్యుత్తు సంస్థలకు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు హైకోర్టుకు వెళ్లి పీపీఏలో మూడో సంస్థకు ప్రమేయం లేదని వాదించాయి. దీంతో హైకోర్టు స్టే విధించింది. అంటే ఎన్ఎల్డీసీని పక్కనపెట్టినట్టే.