సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 24 : ‘నా భూమిని ఆన్లైన్ నుంచి అన్యాయంగా తొలగించిన్రు. ఆ భూమిని నా పేరిట తిరిగి రికార్డుల్లోకి ఎక్కించి పాస్ బుక్కు ఇప్పించాలి’ అని ఓ వృద్ధుడు వేడుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆక్సిజన్ సిలిండర్తో సోమవారం ఆయన కలెక్టరేట్కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన కాసర్ల బాల్రెడ్డి, దేవారెడ్డి, వెంకట్రెడ్డి, హనుమంతరెడ్డి నలుగురు అన్నదమ్ము ళ్లు. ఇందులో దేవారెడ్డికి ఒక కొడుకు తిరుపతిరెడ్డి, ఇద్దరు కూతుళ్లు. కొడుకు 40 ఏండ్ల కిందటే చనిపోయాడు. బిడ్డల వివాహాలు జరిపించాడు.
అయితే 30 ఏండ్ల కిందట తన అ న్న బాల్రెడ్డికి చెందిన సర్వేనంబర్ 391లోని ఎకరం 12 గుంటలు, సర్వే నంబర్ 394లో 33 గుంటలు మొత్తం 2 ఎకరాల 5 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఆ సమయంలో దేవారెడ్డి ఉపాధి నిమిత్తం కొన్నేండ్లపాటు గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చాడు. 2008లో అధికారులకు దరఖాస్తు చేసుకుంటే సదరు భూమి.. దేవారెడ్డి పేరిట పహాణిలో, ఆన్లైన్లో ఎక్కింది. 2017లో అతడి సోదరుడు కాసర్ల బాల్రెడ్డి ఆన్లైన్లో దేవారెడ్డి పేరు తొలగించి అక్రమంగా మళ్లీ తన పేరిట మార్చుకున్నట్టు బాధితుడు ఆరోపించాడు. ఈ వివాదంపై తాను కోర్టును ఆశ్రయిస్తే ఇన్జంక్షన్ ఆర్డర్ ఇచ్చిందని దేవారెడ్డి తెలిపాడు. ఆరేండ్ల కిందట తాను తీవ్ర అనారోగ్యం బారినపడగా, అప్పటినుంచి ఆక్సిజన్ సిలిండర్ లేనిదే బతుకలేకపోతున్నట్టు చెప్పాడు.

తన అనారోగ్య పరిస్థితిని ఆసరాగా చేసుకొని భూమిని కాజేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. 2018 నుంచి జిల్లా అధికారులకు అనేకసార్లు దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ‘వయస్సు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నేను బయట తిరగలేని స్థితిలో ఉన్నా. మరణానంతరం నా భూమిని ఇతరులు ఆక్రమించుకునే ప్రమాదం ఉన్నది. అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి పహాణీలు, కోర్టు ఉత్తర్వులు, ఇతర ఆధారాలను పరిశీలించి నా భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలి’ అని దేవారెడ్డి సోమవారం కలెక్టరేట్లో గరిమా అగర్వాల్ను కలిసి వేడుకున్నాడు.