రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫాల్తు మాటలు కట్టిపెట్టాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. దమ్ముంటే అభివృద్ధిపై మాట్లాడాలని సూచించారు. ‘బండి సంజయ్.. నీ సవాల్ స్వీకరిస్తున్నా.. ఇక్కడే ఉంటా.. ఏ డాక్టర్నైనా తీసుకురా.. డ్రగ్స్ పరీక్షకు నేను సిద్ధం.. కిడ్నీ, రక్తం, చర్మం, వెంట్రుకలు కూడా ఇస్తా.. క్లీన్ చిట్తో బయటకు వస్తా.. అప్పుడు కరీంనగర్ కమాన్ చౌరస్తాలో నీ చెప్పుతో నీవు కొట్టుకుంటావా?’ అని సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. వేములవాడ పట్టణంలో రూ.72 కోట్ల విలువైన వీటీడీఏ, ఆర్అండ్బీ పనులకు ఎమ్మెల్యే రమేశ్బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. రుద్రంగి మండలంలో రూ.3.50 కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.
తిరిగి వేములవాడకు చేరుకొని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని, పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘మోడీ, బోడీ, ఈడీ.. రమ్మనండి ఏం చేసుకుంటారో చేసుకోండి! మాకేం పర్లేదు. ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు ఎందుకు? అది హౌలాగాళ్లు చేస్తారు. దమ్మున్నోడైతే ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పాలి. విచిత్ర జంతువుల్లా, విచిత్రంగా మొరుగుతున్న వీళ్లు (బీజేపీ నేతలు) మనుషులేనా? నాయకులేనా?’ అని నిప్పులు చెరిగారు. ‘భైంసాను దత్తత తీసుకోవడం కాదు! నిన్ను ఎంపీగా గెలిపించిన కరీంనగర్కు, సిరిసిల్ల నేతన్నకు నాలుగేండ్లలో చేసిన మంచి పని ఏంటో చెప్పి కాలవెట్టు. నీవు నిజంగా హిందువైతే, నీకు హైందవ ధర్మం మీద అంత ప్రేమే ఉంటే, చేతనైతే వేములవాడ రాజన్న గుడి అభివృద్ధికి ప్రధానమంత్రితో రూ.500 కోట్లు ఇప్పించు. అప్పుడు నీకంటే గొప్ప హిందువు లేడని ఒప్పుకొంటాం’ అని సవాల్ చేశారు.
దమ్ముంటే మెగా క్లస్టర్ తీసుకురా
ఢిల్లీలో బాగా పలుకుబడి ఉన్నదని ప్రచారం చేసుకొంటున్న బండి సంజయ్.. దమ్ముంటే సిరిసిల్లకు మెగా పవర్లూం క్లస్టర్ తీసుకురావాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘సిరిసిల్ల ఎమ్మెల్యేగా గత ఎనిమిదేండ్ల నుంచి ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు. ఢిల్లీలో ఉండే ప్రతి అడ్డమైన మంత్రి దగ్గరికి పోయి దండం పెట్టినా కనికరించలేదు. నేను తెలంగాణ టెక్స్టైల్స్ శాఖ మంత్రిని, సిరిసిల్ల ఎమ్మెల్యేగా నేత కార్మికుల పక్షాన అడుగుతున్న.. ఆ ప్రాంతానికి మెగా పవర్లూం ఇవ్వండి అని అడిగితే దున్నపోతుపై వానపడ్డట్టు కేంద్రం వ్యవహరించింది’ అని మండిపడ్డారు. ‘కరీంనగర్కు ట్రిపుల్ ఐటీ ఇవ్వాలని బోయినపల్లి వినోద్కుమార్ ఎంపీగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం. కమలాపూర్లో హ్యాండ్లూం క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగాం.. తెచ్చావా? కరీంనగర్లోని తీగల గుట్టపల్లి రైల్వే జంక్షన్ వద్ద ఆర్వోబీ అడిగితే.. రైల్వే, నేషనల్ హైవే డిపార్ట్మెంట్లతో మాట్లాడి అది కూడా తెచ్చే మొఖం లేదు నీకు. వేములవాడ గుడికి రూ.500 కోట్లు తేవాలన్నా, సిరిసిల్లకు మెగా క్లస్టర్, హ్యాండ్లూమ్ క్లస్టర్ తేవాలన్నా మీకు ఇదే ఆఖరి అవకాశం.
ఫిబ్రవరిలో పెట్టేదే కేంద్రంలో మీ ప్రభుత్వానికి ఆఖరి బడ్జెట్. 2024లో పెట్టేది ఓట్ఆన్ అకౌంట్ బడ్జెట్. అందులో ఎలాంటి అవకాశం ఉండదు. ఇప్పటికైనా నీ పలుకుబడి ఉపయోగించి, పనికి మాలిన పాదయాత్రలు, పసలేని విమర్శలు, చిల్లర మాటలు బంద్జేసి.. మోదీ దగ్గరికి పోయి నిధులు తీసుకురా’ అని సూచించారు. పార్లమెంటు సమావేశాల సమయంలో బయట తిరగడం కాదని, పార్లమెంటులోకి వెళ్లి గట్టిగా మాట్లాడాలని హితవు పలికారు. ‘హిందీ రాకపోతే తెలుగులో మాట్లాడు.. అది కూడా రాకపోతే వచ్చిన భాషలో మాట్లాడి కరీంనగర్కు నాలుగు పైసలు తీసుకొచ్చి ప్రజలకు ఏమైనా సేవలు చెయ్యి. ఇక్కడ కూసొని తెల్లారి లేస్తే.. కేసీఆర్ను తిట్టుడు మానుకో. కేసీఆర్ను తిడితే ఓట్లు రావు. మంత్రాలకు చింతకాయలు రాలవు. మేం ఒక పనిచేస్తే మీరు రెండు పనులు చేయండి. వేములవాడలోని తిప్పాపూర్లో మేం వంద పడకల దవాఖాన ఏర్పాటు చేశాం. మీకు చేతనైతే ఇంకా పెద్దాసుపత్రి కట్టాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కాలేజీ పెట్టబోతున్నం. సిరిసిల్ల నేతన్నల బతుకులు మార్చినం. నీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అంతకన్నా పెద్ద పథకం తెచ్చి సంక్షోభంలో ఉన్న కాటన్ పరిశ్రమను అభివృద్ధి చేయాలి’ అని బండి సంజయ్కి సవాల్ విసిరారు.
మారింది పేరు మాత్రమే.. డీఎన్ఏ కాదు
టీఆర్ఎస్ పేరు మాత్రమే మారిందని, డీఎన్ఏ అలాగే ఉన్నదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ‘మారింది పార్టీ పేరు మాత్రమే.. మా డీఎన్ఏ, మా నాయకుడు మారలేదు. మా రంగు, మా ఎజెండా అసలే మారలేదు’ అని పేర్కొన్నారు. తెలంగాణలో చేసిన మంచి పనులను దేశవ్యాప్తంగా చేసేందుకే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందని తెలిపారు. ఒక సదాశయంతో తెలంగాణ బిడ్డగా కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఢిల్లీతో యుద్ధానికి బయలుదేరారని, జాతీయ భావంతో బీఆర్ఎస్ పేరిట హైదరాబాద్ కేంద్రంగా ముందుకు పోవాలన్న ఆలోచనతో సాగుతున్నారని తెలిపారు. ‘ఇద్దరు గుజరాతోళ్లు జాతీయ పార్టీ నడపొచ్చు.. ఢిల్లీలో బొంగరాలు, చక్రాలు తిప్పొచ్చు.. వాళ్లకు చెప్పులు మోసే ఇక్కడి బానిసలకు ఓట్లేసి గెలిపించాలా? మీ కోసం తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్.. ఆయన జాతీయ పార్టీ పెడితే వీళ్లకొచ్చిన నొప్పి, బాధ ఏంది? మీ ఆశ్వీరాదం ఉంటే ఢిల్లీతో కొట్లాడుతాం, ఇంకెవరితోనైనా కొట్లాడుతాం. ఎనిమిదేండ్లలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన నాయకుడు కేసీఆర్.
ధార్మికుడు, అన్ని పనులు బాగా చేసిన నాయకునికి మానవ ఆశీర్వాదంతోపాటు దేవుడి ఆశీర్వాదం కూడా ఉన్నది. ఆయనకు మనం అండగా నిలబడి జాతీయ స్థాయిలో మనవాణిని బలంగా వినిపించేలా నడిపించాలి’ అని పేర్కొన్నారు. సూరత్, మహారాష్ట్ర, గుజరాత్లో ఉంటున్న తెలంగాణ బిడ్డలు బీఆర్ఎస్కు అండగా నిలబడాలని కోరారు. బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ విమర్శలను మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. అలా అయితే బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలుపాలని ఎందుకు గొడవ చేస్తున్నారని నిలదీశారు.
సెస్పై గులాబీ జెండా ఎగురవేస్తాం
సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంఘానికి జరుగుతున్న ఎన్నికల్లో 15 స్థానాలను బీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్తు సంస్థ సహకార పద్ధతిలో నడుస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రూ.54 కోట్లతో 34 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మరమగ్గాలకు విద్యుత్తు సబ్సిడీ, రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రైతులు, నేతన్నలు, వినియోగదారులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పథకం కింద 64 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు అందించిన ఏకైక ప్ర భుత్వం తమదేనని అన్నారు. రూ.7,300 కోట్లతో 26 వేల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ నేతలు తోట ఆగయ్య, చీటి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
ఫాల్తు మాటలు.. ఫాల్తు రాజకీయాలు పనికిమాలిన హౌలా నాయకులు చేస్తరు. దమ్మున్నోడైతే ప్రజలకు ఏం అవసరమో అది చేస్తడు. నేను ఖుల్లంఖుల్లా ఒక్కటే మాట చెప్తున్న. బండి సంజయ్.. నీ సవాల్ స్వీకరిస్తున్నా.. ఇక్కడనే ఉంటా.. ఏ డాక్టర్నైనా తీసుకురా.. డ్రగ్స్ పరీక్షకు నేను సిద్ధం.. కిడ్నీ, రక్తం, చర్మం, వెంట్రుకలు ఏదడిగినా ఇస్తా.. నేను క్లీన్చిట్తో బయటకు వస్తా.. అప్పుడు కరీంనగర్ కమాన్ చౌరస్తాలో నీ చెప్పుతో నువ్వు కొట్టుకుంటవా?
-మంత్రి కేటీఆర్