హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు శాంతిభద్రతల సమస్యే పెద్దదిచేసి చూపే ప్రయత్నం చేశారు సమైక్య పాలకులు. కానీ ఎనిమిదేండ్ల స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ, దేశంలోనే అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా పేరు సంపాదించింది. దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా హైదరాబాద్ నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతిభద్రతలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు.
పోలీస్శాఖకు గతంలో ఎన్నడూ లేని విధంగా విరివిగా నిధులిస్తూ బలోపేతం చేశారు. అవసరమైన మేరకు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం సహకారం అందిస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వేల మంది యువత పోలీస్శాఖలో భర్తీ అయ్యారు. మహిళా భద్రతలోనే ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ పోలీసులు నిలిచారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీ వినియోగంతో నేరాలను కట్టిడి చేసే స్థితిలో నేడు మన పోలీసులు ఉన్నారు. ఇందులో తెలంగాణ పోలీసులు ఇతర రాష్ర్టాల వారికి ఆదర్శంగా నిలస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో ఓ వైపు సాంకేతిక వినియోగాన్ని పెంచుతూనే, మరోవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో తెలంగాణ పోలీసులు ముందుకు వెళుతున్నారు.
ఈ ఎనిమిదేండ్లలో పోలీస్శాఖలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మార్పుల్లో ముఖ్యమైనవి
అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోని తొలిసారిగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్-12లో మొత్తం 19 అంతస్థుల్లో నిర్మస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మరో అద్భుతం. దాదాపు రూ.600 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రజలను సకాలంలో రక్షించడంలో ప్రభుత్వశాఖల మధ్య సమన్వయంతో పనిచేసేందుకు ఈ సెంటర్ ఉపయోగపడనున్నది.
పెండింగ్ కేసుల సంఖ్య గణనీయమైన రీతిలో 146.51 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది. పోలీసుల సమర్థత పెరగడంతో శిక్షల శాతం (కన్విక్షన్ రేట్) 48.55 శాతానికి చేరింది.
చరిత్రలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరం గత ఏడేండ్లుగా మతకల్లోల మాటే లేకుండా ప్రశాంతంగా ఉన్నది.
యూనిఫాం సర్వీస్ డెలివరీ కోసం దేశంలోనే తొలిసారిగా పోలీస్శాఖలో 16 వర్టికల్స్ పని విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీంతో పౌరులు ఏ సమయంలోనైనా ఫిర్యాదు చేస్తున్నారు.
పోలీస్ సంక్షేమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులకు ప్రభుత్వం 30 శాతం రిస్క్ అలవెన్స్ ఇస్తున్నది.
తెలంగాణ ఏర్పడక ముందు నెలకు రూ.12 వేలు ఉన్న హోంగార్డుల జీతాలు ఇప్పుడు రూ.20 వేలకు పెంచారు. ఏటా రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18,491 మంది హోంగార్డుల కుటుంబాలకు లబ్ధి.
ప్రతినెల పోలీస్ స్టేషన్ల నిర్వహణకు సిటీ పోలీస్ స్టేషన్కు రూ.75 వేలు, పట్టణ పోలీస్ స్టేషన్కు రూ.50 వేలు..గ్రామీణ పోలీస్ స్టేషన్కు రూ.25 వేలు ఇస్తున్నారు.
పోలీసుల రోజువారీ విధుల్లో టెక్నాలజీ వాడకం పెరిగింది. 56 రకాల సర్వీసులతో రాష్ట్రస్థాయిలో టీఎస్కాప్ యాప్ను ప్రవేశపెట్టారు. హాక్ఐ, లాస్ట్రిపోర్టు, ఈ-పెటీ కేసుల వంటి యాప్స్ను, హైదరాబాద్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లు అందుబాటులోకి తెచ్చారు.
మహిళా భద్రత కోసం అనేక నూతన సంస్కరణలకు పోలీస్శాఖ శ్రీకారం చుట్టింది. 2014 అక్టోబర్లో దేశంలోనే తొలిసారిగా షీటీమ్స్ ఏర్పాటు చేశారు. మహిళా భద్రత కోసం అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు. దేశంలోనే తొలిసారిగా భరోసా కేంద్రాలు ఏర్పాటు.
ప్రభుత్వ కఠిన నిర్ణయాలతో గ్యాంబ్లింగ్ సెంటర్లు, పేకాట క్లబ్బుల మూతపడ్డాయి. హైదరాబాద్ తోపాటు, రాష్ట్రంలో ఉగ్రవాదఛాయలు కనిపించడం లేదు.
అత్యవసర సమయాల్లో పోలీసులు త్వరితగతిన స్పందించేలా 12 వేల టూవీలర్స్, ఏడువేల ఫోర్వీలర్స్ సమకూర్చారు. వీటిలో మూడువేలు పెట్రోలింగ్ వాహనాలుగా పనిచేస్తున్నాయి. పటిష్టమైన వాహన సదుపాయం కారణంగా ప్రధాన నగరాల్లో 5 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 8 నిమిషాల్లోనే పోలీసులు స్పాట్కు చేరుతున్నారు.
2014 నుంచి ఇప్పటికే
26,779 ఉద్యోగాలు పోలీస్శాఖలో
భర్తీ చేయగా, యూనిఫాం సర్వీసెస్లోని
అన్ని విభాగాల్లో కలిపి మొత్తం
17,516 పోస్టులకు నియామక
ప్రక్రియ కొనసాగుతున్నది.