హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం, గోధుమలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. కేవలం గోధుమల ఎగుమతికే మోదీ సర్కారు అనుమతి ఇచ్చింది. దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని, కొత్తగా వచ్చే పంట కొనలేమని చెప్తున్న కేంద్రం.. ఎగుమతికి అవకాశం ఉన్నా పట్టించుకోవటం లేదు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచానికి తీవ్ర ధాన్యం కొరత ఏర్పడింది. గోధుమలు, మక్కజొన్నలు ఉక్రెయిన్, రష్యాలో ఎక్కువగా పండుతాయి. వీటిని చైనా, ఈజిప్ట్, వియత్నాం తదితర దేశాలు భారీ ఎత్తున దిగుమతి చేసుకొంటాయి. గోధుమలను ఆహారంగా, మక్కజొన్నను పశువుల మేతగా వినియోగిస్తుంటారు. యుద్ధం నేపథ్యంలో కొరత ఏర్పడి అనేక దేశాలు మక్కజొన్నలకు బదులు నూకలను పశువులకు మేతగా వినియోగిస్తున్నాయి. మోదీ సర్కారు మాత్రం గోధుమల ఎగుమతిపైనే దృష్టిపెట్టింది.
మన దేశం నుంచి గోధుమలు కొనేలా ఈజిప్ట్ను కేంద్రం ఒప్పించింది. సుమారు 10 లక్షల టన్నుల గోధుమలు కొనేందుకు ఈజిప్ట్ ముందుకొచ్చింది. ఈ నెలలో 2.40 లక్షల టన్నులు సరఫరా చేయాలని కోరింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా నూకలకు విపరీతంగా డిమాండ్ ఉన్నదని ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) స్ప ష్టం చేస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం క్వింటాలు నూకల ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.2,100కి పెరిగింది. ముఖ్యంగా మన దేశం నుంచి చైనా, వియత్నాం భారీగా నూకలను కొనుగోలు చేస్తున్నట్టు అమెరికా వ్యవసాయ విభాగం పేర్కొన్నది. గతేడాది బియ్యం ఎగుమతుల్లో 97 శాతం నూకలేనని తెలిపింది. అనేక దేశాలు నూకలను దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి. అయినా కేంద్రం ఈ వైపు దృష్టిపెట్టలేదు.
యాసంగిలో తెలంగాణలో పండే ధాన్యాన్ని బాయిల్డ్ రైస్గా మార్చాలని ముడిబియ్యంగా మార్చితే నూకశాతం ఎక్కువవుతుందని సీఎం కేసీఆర్ ముందునుంచీ చెప్తున్నారు. కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకొనేందుకు ఒప్పుకోని పక్షంలో.. నేరుగా వడ్లు కొనుగోలు చేయాలని, వాటిని ముడిబియ్యంగా మార్చుకోవాలని సూచించారు. ఈ సలహాను కేంద్రం పెడచెవిన పెట్టి, తెలంగాణ రైతులను అరిగోస పెట్టింది. అయితే సీఎం కేసీఆర్ మాటవిని.. కేంద్రం వడ్లు కొనుగోలు చేసి బియ్యం పట్టిస్తే వచ్చిన నూకలను విదేశాలకు అమ్ముకొనే అవకాశం ఉండేదని నిపుణులు చెప్తున్నారు. తద్వారా కేంద్రానికి ఆదాయం వచ్చేదని, తెలంగాణ రైతులకు, ప్రభుత్వానికి ఇబ్బంది తప్పేదని అంటున్నారు. ప్రతి విపత్తు ఒక అవకాశం.. దానిని అనుకూలంగా మలుచుకొంటే బాగుపడుతామన్న పెద్దల మాటలను మోదీ ప్రభుత్వం పట్టించుకోని ఫలితంగా మంచి అవకాశం కోల్పోయామని విమర్శిస్తున్నారు.