హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఈసెట్, ఎంసెట్ పరీక్షలపై వర్షాల ప్రభావం పడనున్నది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న ఈసెట్, 14 నుంచి ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి అధికారులు పునరాలోచనలో పడ్డారు. పరీక్షలను యథాతథంగా నిర్వహించడమా.. లేక వాయిదావేయడమా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఈ మేరకు ఆదివారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి టీసీఎస్ అధికారులతో సమీక్షించారు. వరదలు పొంగి రోడ్లు తెగిపోయి, సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభిస్తేనే పరీక్షల నిర్వహణకు ఆటంకం కలుగుతున్నదని టీసీఎస్ వర్గాలు పేర్కొన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ముసురే కురుస్తుండటంతో పరీక్షలను యథాతథంగా నిర్వహించుకోవచ్చని అభిప్రాయపడినట్టు సమాచారం. మొత్తం మీద సోమవారం నాటి వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని ఓ ఉన్నతాధికాకారి తెలిపారు.