హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు చెందిన విద్యా పరిశోధకుడు డాక్టర్ వీ గురునాథరావుకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు నుంచి ఆహ్వానం అందింది. దాంతో ఆయన వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7వరకు నాగపూర్లో నిర్వహించే 108వ కాంగ్రెస్ సదస్సుకు హాజరుకానున్నారు. సదస్సులో గురునాథరావు ‘జాతీయ విద్యా విధానం 2020- పాఠశాల విజ్ఞాన శాస్త్ర విద్య’ అనే అంశంపై పరిశోధనా పత్రం సమర్పించనున్నారు.
ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని కంబాలపల్లి జిల్లా పరిషత్తు సెకండరీ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా గురునాథరావు పనిచేస్తున్నారు. గతంలో అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. సుమారు 90కి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. ఇందులో 50కి పైగా పరిశోధన పత్రాలు పుస్తక సంకలనాల్లో ప్రచురితమయ్యాయి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ప్రధాని మోదీతోపాటు నోబెల్ గ్రహీతలు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు హాజరవుతారు.