హైదరాబాద్ : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం జిల్లాల కలెక్టర్లు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, పురపాలకశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అందరి భాగస్వామ్యంతో పాఠశాలలను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 65 లక్షలమంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
అధికారులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులంతా భాగస్వామ్యం కావాలని, సర్పంచులు బాధ్యత తీసుకోవాలని కోరారు. పరిశుభ్రతను నిరంతరం కొనసాగించాలన్నారు. ఈ అంశంలో ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ.. పాఠశాలలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాలలు శుభ్రంగా ఉన్నట్లు హెచ్ఎంలు ధ్రువపత్రం ఇవ్వాలన్నారు. ఏఎన్ఎంలు, వైద్య సిబ్బందిని కూడా సిద్ధం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.