హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): వచ్చే నెలలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయం నుంచి కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పరీక్షలు జరపాలని మంత్రి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రతీ పరీక్ష కేంద్రాన్ని ముందుగానే సందర్శించాలని, వసతులు పరిశీలించాలని సూచించారు. ఇంటర్ పరీక్షలకు 9,07,396 మంది, టెన్త్ పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఎండలు ఎకువగా ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్యారోగ్య సిబ్బందిని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లను ఉంచాలని సూచించారు.మంచినీటి వసతి కల్పించాలని, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపాలని సూచించారు. పరీక్షలు అనగానే విద్యార్థులు భయాందోళనకు గురవుతారని, వారికోసం కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయాలని చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.