హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూపు సంస్థకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ షాక్ ఇచ్చింది. ఆ సంస్థతో కుదుర్చుకొన్న ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) పేరుతో బడుల్లో ఇవి చేస్తాం.. అవి చేస్తామంటూ ఊదరగొట్టిన సంస్థ ఆఖరుకు చేతులెత్తేసిందని, ఇష్టారీతిన వలంటీర్లను నియమించిందని అధికారవర్గాలు తెలిపాయి. వలంటీర్ల నియామకానికి అదానీ ఫౌండేషన్ వసూళ్లకు పాల్పడినట్టు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆ సంస్థతో ఒప్పందాన్ని పెండింగ్లో పెట్టారు. దీనిపై సమగ్ర విచారణకు ఆ దేశిస్తూ, డీఈవోలు, ఆర్జేడీలకు ఆదేశాలిచ్చారు. ఉత్తర్వులు వచ్చే వరకు కార్యక్రమాలు కొనసాగించరాదని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖలో సీఎస్సార్లో భాగంగా నిధులు, మానవనరులను అందించడంలో భాగంగా ‘విద్యాంజలి’ అనే కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ చేపట్టింది. రెండు విడతల్లో ‘విద్యాంజలి 2.0’ కొనసాగుతున్నది. విరాళాలతో పాటు బడి ప్రగతికి బాటలు వేయవచ్చు. విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలవారు, ఉద్యోగ విరమణ పొందినవారు వలంటీర్గా సేవలందించవచ్చు. వృత్తివిద్య, మార్షల్ ఆర్ట్స్, యోగా, కథలు చెప్పడం, పోటీ పరీక్షలకు, నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వవచ్చు. వలంటీర్లు స్వచ్ఛందంగా సేవలందించాలి.
ఎంవోయూకు విరుద్ధంగా అదానీ ఫౌండేషన్?
‘విద్యాంజలి 2.0’ కార్యక్రమంలో భాగంగా అదానీ ఫౌండేషన్ వలంటీర్లను నియమించుకొనే క్రమంలో వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా కొంతమంది విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. వేతనాలుంటాయని చెప్పి వలంటీర్లను నియమించుకొన్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో అధికారులు అదానీ ఫౌండేషన్తో ఎంవోయూను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫిర్యాదులపై విచారణ జరుపుతామని విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. అదానీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్తోపాటు ఎంవోయూ మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఏపీఎల్ హెల్త్ కేర్ సంస్థతో ఒప్పందాన్ని కూడా నిలిపేసినట్టు చెప్పారు. అదానీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్తోపాటు ఎంవోయూ మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఏపీఎల్ హెల్త్ కేర్ సంస్థతో ఒప్పందాన్ని కూడా నిలిపేసినట్టు చెప్పారు.