హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీ 64 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ కుంభకోణంలో శుక్రవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విజయవాడకు చెందిన యోహాన్రాజు, అతని భార్య ప్రమీలరాణిని అరెస్టు చేశారు. ఈ స్కాంలో నిందితుడైన ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ మస్తాన్వలీకి ఈ దంపతులు స్నేహితులు. విజయవాడలో చిట్టినగర్, ఫైజర్పేట పెద్దిరాజులవారి ప్రాంతానికి చెందిన యోహాన్రాజు మెడికల్ షాపును నిర్వహిస్తున్నాడు. అక్కడి ఆంధ్రాబ్యాంక్ బ్రాంచిలో పని చేసినప్పుడు మస్తాన్వలీ పరిచయం అయ్యాడు. యోహాన్రాజు చాలామందికి ఆ బ్యాంకులో రుణాలు కూడా ఇప్పించాడు. తెలుగు అకాడమీ స్కాం ప్రధాన సూత్రధారి సాయికుమార్ అనుచరునితో పరిచయం ఏర్పడటం వల్ల ఇందులోనూ పాలుపంచుకొన్నాడు. ఫిక్స్డ్ డిపాజిట్ల నగదు తరలింపులో ఖాతాలను తెరిచి వాటిని తన ఖాతాతో పాటు, ప్రమీలరాణి ఖాతాల్లో జమచేసి 50 లక్షలు కమిషన్ తీసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. వారి కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తుండగా ఏపీలో గతంలో చోటు చేసుకున్న ఆయిల్ఫెడ్, వేర్హౌజింగ్ కార్పోరేషన్ల కుంభకోణంలో రూ.14.6 కోట్లు కొట్టేసిన కేసులో యోహాన్రాజు దంపతుల పాత్ర ఉందని తేలడంతో వారిని విజయవాడ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఈ సమాచారంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పీటీ వారెంట్పై యోహాన్రాజును, అతని భార్య ప్రమీలరాణీని అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకువచ్చారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 13కు చేరింది. ప్రధాన సూత్రధారి సాయితో కలుపుకుని మొత్తం ఆరుగురిని విచారణ కోసం కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.