హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): చైనాకు చెందిన పలు రుణ యాప్ కంపెనీలపై ఈడీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇన్స్టంట్ పర్సనల్ రుణాల పేరిట నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇచ్చి, అడ్డగోలు వడ్డీలు వసూలు చేసిన డబ్బుతో మనీలాండరింగ్కు పాల్పడుతున్న ఆరోపణలపై ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కుడోస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏస్ మనీ (ఇండియా) లిమిటెడ్, రినో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పయనీర్ ఫైనాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన మొత్తం రూ.86.65 కోట్లను ఈడీ అధికారులు బుధవారం జప్తు చేశారు. 155 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. భారత్లో గడువు తీరిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్ఎఫ్బీసీ) లైసెన్స్లతో చైనా, హాంకాంగ్కు చెందిన వ్యక్తుల సూచనలతో భారత్లో కొందరు మారు పేర్లతో ఈ ఆన్లైన్ ఇన్స్టంట్ లోన్యాప్స్ను నడుపుతున్నట్టు ఈడీ గుర్తించింది. సదరు కంపెనీలు ఇప్పటి వరకు మొత్తం రూ.940 కోట్ల మేర కొల్లగొట్టినట్టు తేల్చింది. గతంలోనూ రూ.72.32 కోట్లు జప్తు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.