న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఆర్థిక సంక్షోభంతో మూతపడిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్ అయ్యారు. కెనరా బ్యాంక్ వద్ద రూ.538 కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నది. శనివారం ముంబైలోని పీఎంఎల్ఐ కోర్టు ముందు హాజరుపరచగా..ఆయనను ఈ నెల 11 వరకు ఈడీ కస్టడికి అనుమతినిస్తూ కోర్టు తీర్పువెల్లడించింది.
ప్రీవెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టానికి లోబడి అరస్టైన గోయల్ను..ఈడీ వర్గాలు విచారించనున్నాయి. సంస్థ బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు, నిధుల మళ్లింపు ఏమైనా జరిగిందా దానిపై ప్రధానంగా విచారించనున్నది. కెనరా బ్యాంక్ వద్ద గతంలో జెట్ ఎయిర్వేస్ రూ.848.86 కోట్ల రుణం తీసుకోగా, దీంట్లో కొంతమేర చెల్లింపులు జరిపింది. అయినప్పటికీ ఇంకా రూ.538.62 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. దీనిపై బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేయగా..జూలై 2021లోనే మోసపూరిత ఖాతాగా గుర్తించింది.