BJP Party | హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీలో విబేధాలు భగ్గుమంటున్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చిన తర్వాత బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గీయుల మధ్య సోషల్ మీడియా వేదికగా తిట్ల పురాణం కొనసాగుతూనే ఉంది. తాజాగా బుధవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలోనే తీవ్ర ఘర్షణ జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే.. పార్టీ సోషల్ మీడియా కూడా రెండు గ్రూపులుగా విడిపోయింది. బండి సంజయ్, ఈటల రాజేందర్.. ఒకరిపై మరొకరు వ్యంగ్యంగా వీడియోలు పోస్టులు చేస్తున్నారు.
పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కు హాజరైన ఈటల రాజేందర్ వర్గీయులు, బండి సంజయ్ మద్దతుదారులపై దాడి చేశారు. సోషల్ మీడియాలో ఈటలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న బండి వర్గీయులపై విరుచుకుపడ్డారు. ఈటల రాజేందర్ మద్దతుదారుడు.. బండి సంజయ్ వర్గీయుడిని కాలర్ పట్టుకుని లాగడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా గదికి ఈటల మద్దతుదారులు తాళం వేసి హంగామా సృష్టించారు. అయితే పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను తొలగింపబడడానికి ఈటల రాజేందరే కారణమని బండి మద్దతుదారులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.