బంజారాహిల్స్, జూన్ 22: రొమ్ము క్యాన్సర్ను జీరో దశలోనే గుర్తించే అత్యాధునిక విధానం ‘ఈజీ చెక్-బ్రెస్ట్’ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు అపోలో దవాఖాన ప్రకటించింది. దాతర్ క్యాన్సర్ జెనెటిక్స్ సంస్థ రూపొందించిన ఈ విధానాన్ని అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి, దాతర్ క్యాన్సర్ జెనెటిక్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రాజన్ దాతర్ ఆవిష్కరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాలతో రొమ్ము క్యాన్సర్ను గుర్తించటం ఆలస్యమవుతున్నదని, ఆ సమస్యకు ఈజీ చెక్-బ్రెస్ట్తో చెక్ పెట్టవచ్చని తెలిపారు. లక్షణాలు లేకున్నా, క్యాన్సర్ కణాలుంటే వారి నుంచి 5 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరించి జెనెటిక్ విధానం ద్వారా విశ్లేషణ చేయవచ్చని, దీన్ని క్యాన్సర్పై తొలి విజయంగా చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అత్యాధునిక విధానాన్ని పరిశీలించేందుకు 40 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా, 99 శాతం మందిలో కచ్చితమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. 40 ఏండ్లు వచ్చినప్పటి నుంచి ఈ పరీక్ష చేయించుకోవాలని, కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ బ్యాగ్రౌండ్ ఉంటే 30 ఏండ్ల నుంచే ఈ పరీక్ష చేయించుకొంటే మంచిదని సూచించారు. సమావేశంలో అపోలో హాస్పిటల్స్ ఆంకాలజీ ప్రెసిడెంట్ దినేశ్ మాధవన్ తదితరులు పాల్గొన్నారు.