ఈజీగా డబ్బు దోచుకోవడానికి చెడుమార్గం
సిద్దిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద రెక్కీ
అదునుచూసి కాల్పులు.. డబ్బుతో పరార్
బంధువులతో కలిసి పాత నేరస్థుల దోపిడీ
సిద్దిపేట కాల్పుల ఘటన నిందితుల అరెస్టు
మీడియాకు వివరాలు వెల్లడించిన సీపీ శ్వేత
సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 7: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దిపేట కాల్పుల దోపిడీ ఘటనను పోలీసులు ఛేదించారు. జల్సాల కోసం చెడుమార్గం పట్టిన ఇద్దరు పాత నేరస్థులు బంధువులు ఇద్దరితో కలిసి దోపిడీకి పాల్పడినట్టు తేల్చారు. నిందితులను అరెస్టుచేసిన పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత మీడియాకు వెల్లడించారు. సిద్దిపేట వన్టౌన్ పోలీస్స్టేషన్లో 2001లో పోక్సో కేసులో గజ్జె రాజు, సాయికుమార్ అరెస్టు అయి, బెయిల్పై బయటకొచ్చారు. చెడు అలవాట్లకు బానిసలైనవీరు ఏదైనా క్రైమ్చేసి డబ్బులు సంపాదించాలని పథకం పన్నారు. రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సిద్దిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద క్రయవిక్రయాలు జోరుగా సాగుతాయని, అక్కడ లక్షల్లో చేతులుమారే అవకాశం ఉంటుందని తెలుసుకున్నారు. గతంలో దొంగిలించిన పల్సర్ బైక్పై రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి, లావాదేవీలను గమనించారు. రియల్ఎస్టేట్ వ్యాపారి వకుళాభరణం నర్సయ్య హౌసింగ్ బోర్డుకాలనీలోని తన ప్లాట్ను శ్రీధర్రెడ్డి అనే వ్యక్తికి విక్రయించాడు. జనవరి 31న రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చారు. శ్రీధర్రెడ్డి రూ.43.50 లక్షలు నర్సయ్యకు ఇచ్చాడు. రిజిస్ట్రేషన్ నిమిత్తం నర్సయ్య రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లగా.. గజ్జె రాజు (ఏ-1), సాయికుమార్ (ఏ-2) బైక్పై వచ్చి తుపాకీతో శ్రీధర్రెడ్డి డ్రైవర్ పరశురాములును బెదిరించారు. కారు డోర్ తీయాలని, లేదంటే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. భయపడ్డ డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా, నిందితులు అడ్డుకొని కాల్పులు జరిపి డబ్బుల బ్యాగుతో పరారయ్యారు. వీరికి బంధువులైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బండ్లగూడవాసి బలిపురం కరుణాకర్ (ఏ-3), సికింద్రాబాద్కు చెందిన బిగుళ్ల వంశీకృష్ణ (ఏ-4) సహకరించారన్నారు. 15 పోలీసు బృందాలను ఏర్పాటుచేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. తొలుత ఎడమ సాయికుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. తనతోపాటు మరో ముగ్గు రున్నారని చెప్పాడు. నలుగురు నిందితులను అరెస్టు వారి నుంచి రూ.34 లక్షల నగదు, రెండు బైకులు, కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ వివరించారు. తుపాకీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశంపై ఇంకా ప్రశ్నించాల్సి ఉన్నదని తెలిపారు.