దుబ్బాక టౌన్, జనవరి 12 : సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత కార్మికులు మగ్గంపై నేసిన లినెన్ కాటన్ చీరకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర చేనేత,జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 17 వరకు ‘విరాసత్ పేరిట’ ఢిల్లీలో నిర్వహిస్తున్న చీరల ప్రదర్శనలో వివిధ ప్రాంతాల చేనేత కార్మికులు తయారుచేసిన 75 చీరలను ఎంపిక చేయగా, అందులో దుబ్బాకకు చెందిన లినెన్ చీరకు స్థానం దక్కింది. దుబ్బాకలోని హ్యాండ్లూమ్ ప్రొడ్యూసర్ కంపెనీలో కార్మికులు నేసిన లినెన్ కాటన్ చీర ఎంపిక కావడం పట్ల ఆ కంపెనీ సీఈవో బోడ శ్రీనివాస్ గురువారం హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తమ చీరలకు దేశమంతటా గుర్తింపు లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చీరలతోపాటు నాణ్యమైన, స్వచ్ఛమైన లినెన్ షర్టింగ్, షూటింగ్ తయారీపై దృష్టిసారించినట్టు తెలిపారు. ప్రపంచంలో వందశాతం లినెన్ నూలుతో చీరలను తయారుచేసిన ఘనత దుబ్బాక చేనేత కార్మికులకు దక్కడం గర్వంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. టై అండ్ డై విధానంతో ఇక్కత్ చీరలను తయారు చేయడం ఎక్కడా సాధ్యపడలేదని కేవలం దుబ్బాకలో తయారీచేసి ఔరా అనిపించుకున్నట్టు ఆయన చెప్పారు.