హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. ఒకేసారి డబుల్ పీజీలను చదివే అవకాశం కల్పించింది. ఈ డ్యూయల్ పీజీ కోర్సులను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది. త్వరలోనే అడ్మిషన్లు కూడా ప్రారంభిస్తామని తెలిపింది. విద్యార్థి ఒకే సమయంలో రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో చేరి, రెండు పీజీ పట్టాలను పుచ్చుకోవచ్చు. కొత్త కోర్సు నిర్వహణ కోసం కళాశాలలు ఈ నెల 30లోపు తమను సంప్రదించి అనుమతులు తీసుకోవాలని జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
ఈ డబుల్ పీజీ తరగతులను అక్టోబర్ 30 నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. వర్సిటీలో పీజీ చేస్తున్న విద్యార్థులే డబుల్ పీజీకి అర్హులని, ఇతర వర్సిటీలకు అవకాశం లేదని స్పష్టంచేశారు. మూడేండ్ల (ఆరు సెమిస్టర్ల) సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సుకుగాను ఒకో సెమిస్టర్కు రూ.25,000 ఫీజు ఉంటుందని పేర్కొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాల మేరకు ఈ కోర్సులను అమలుచేస్తున్నట్టు వివరించారు. ఈ కోర్సు పాఠ్యాంశాల్లో డాటా అనలిటిక్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, విశ్లేషణ, మారెటింగ్ మేనేజ్మెంట్, బిజినెస్ ఎకనామిక్స్, లీగల్, బిజినెస్ ఎన్విరాన్ మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మొదలైనవి ఉంటాయి. కాగా, వర్సిటీ గత ఏడాదిలో బీటెక్, బీ ఫార్మసీ విద్యార్థులు బీబీఏ డాటా అనలిటిక్స్ ప్రోగ్రామ్ను డ్యూయల్ డిగ్రీ ద్వారా పూర్తి చేసే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
అమలు ఇలా..
ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సుల్లోని విద్యార్థులు రెండో పీజీగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ఏకకాలంలో చేరవచ్చు.
కొన్ని సబ్జెక్టులను ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తారు, మిగిలిన సబ్జెక్టులకు వర్సిటీ ద్వారా ఆన్లైన్లో క్లాసులుంటాయి.