హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): డార్క్వెబ్ను ఉపయోగిస్తూ క్రిప్టో కరెన్సీ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న ఇద్దరు డ్రగ్స్ విక్రేతల నెట్వర్క్ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) పోలీసులు ఛేదించారు. వారిద్దరితోపాటు ఏజెంట్లుగా పనిచేస్తున్న ఆరుగురిని కటకటాల్లోకి నెట్టారు. 30 మంది డ్రగ్స్ వినియోగదారులపైనా కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో తొలిసారి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కేసు వివరాలను వెల్లడించారు.
గోవాకు చెందిన నరేంద్ర ఆర్యా.. హోలీ షాప్ పేరుతో, రాజస్థాన్కు చెందిన ఫర్హాన్ మహ్మద్ అన్సారీ.. ట్రిమినేటర్ పేరుతో డార్క్ వెబ్లో సోషల్ నెట్వర్క్లను నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరు వాటిల్లో డ్రగ్స్ రకాలు, వాటి ధరలను పొందుపరిచారని వెల్లడించారు. డ్రగ్స్ కావాల్సినవాళ్లు క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తే కొరియర్లో డ్రగ్స్ పంపిస్తారని వివరించారు.
ఇటీవల గోవాకు చెందిన ప్రధాన డ్రగ్స్ విక్రేత ప్రితీశ్ నారాయణ బోర్కర్ అలియాస్ బాబును అరెస్టు చేసి విచారణ చేపట్టగా, డార్క్ వెబ్ గుట్టు బయటపడిందని సీపీ తెలిపారు. నరేంద్ర ఆర్యా, అన్సారీ వద్ద ఏజెంట్లుగా పనిచేస్తున్న ఆరుగురు హైదరాబాదీలు ఉక్తార్ష్ ఉమాంగ్, షహీల్ శర్మ, అబ్దుల్లా అన్సారీ అహ్మద్ ఖాన్, ఇంద్రకుమార్, అవిటి చరణ్ కుమార్, భూషణ్రాజ్ను అరెస్టు చేశామని చెప్పారు. వీరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసే 30 మంది వినియోగదారులను గుర్తించి, వారిపైనా కేసు నమోదు చేశామని వెల్లడించారు. సమావేశంలో హెచ్న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఇన్స్పెక్టర్ రాజేశ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.