సంగారెడ్డి, జూలై 4 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తు రవాణా అవసరాల్లో డ్రైవర్ రహిత (అటానమస్) వాహనాల పాత్ర కీలకంగా ఉంటుందని కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్లో దేశంలోనే మొట్టమొదటి అటానమస్ నావిగేషన్ బెడ్ను ఆయన ప్రారంభించారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ అండ్ డాటా ఇక్విజేషన్ సిస్టమ్(టీ హాన్) తయారు చేసిన డ్రోన్ ప్యాసింజర్, డ్రైవర్హ్రిత వాహనం, అటాపమస్ సైకిల్ను పరీక్షించారు. ఆ వాహనంలో కొద్దిసేపు కేంద్రమంత్రి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్లు రాజ్యలక్ష్మి, కిరణ్కూచి, టీహాన్ విద్యార్థులను ఆయన అభినందించారు.
అనంతరం జరిగిన సమావేశంలో జితేంద్రసింగ్ మాట్లాడుతూ.. డ్రైవర్హ్రిత వాహనాలు అందుబాటులోకి వచ్చేలా మరిన్ని పరిశోధనలు జరుపాలని సూచించారు. దేశ్యాప్తంగా 25 కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గతంలో ఐఐటీ మద్రాస్కు ప్రత్యేక గుర్తింపు ఉండేదని, ఇప్పుడు ఐఐటీ హైదరాబాద్ సరికొత్త పరిశోధనల ద్వారా విశేష గుర్తింపు పొందుతున్నట్టు చెప్పారు. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్లో రూ.135 కోట్లుతో రెండు కిలోమీటర్ల మేర అటానమస్ నావిగేషన్ టెస్టు బెడ్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దేశంలోనే ఇది మొట్టమొదటి టెస్టుబెడ్ అని వెల్లడించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్, ఐఐటీ గవర్నింగ్ బోర్డు చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.