హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశ రక్షణ, అంతరిక్ష రంగాలకు హైదరాబాద్ బలమైన పునాది అని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీశ్రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఈ రంగాలు ఇక్కడ భారీగా విస్తరించగలవని చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో గురువారం ‘స్ట్రాటజీస్ ఫర్ బ్రిడ్జింగ్ టెక్నాలజీ, స్టార్టప్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఇండియా’ అంశంపై వర్చువల్గా సదస్సు నిర్వహించారు. సదస్సులో సతీశ్రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ.. ఏ పరిశ్రమలోనైనా నాణ్యత, పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కీలక భూమిక పోషిస్తాయని అన్నారు. భారత ప్రభుత్వ డిఫెన్స్ ప్రొడక్షన్ విభాగం అడిషనల్ సెక్రటరీ సంజయ్జాజు మాట్లాడుతూ.. భారత దేశానికి హైదరాబాద్ నగరం డిఫెన్స్, ఏరోస్పేస్ రాజధానిగా ఉందని అన్నారు. రక్షణరంగ ఉత్పత్తుల తయారీ, పరిశోధనలకు హైదరాబాద్ హబ్గా మారిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ అన్నారు. 80 శాతం రక్షణరంగ సంస్థలు హైదరాబాద్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.