హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బిడ్డకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల మండలం బావుసింగ్పల్లికి చెందిన డాక్టర్ రాంకిషన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆహ్వానం అందింది. బయోలాజికల్ స్టాండైర్డెజేషన్పై నియమించిన నిపుణుల కమిటీలో (ఎక్స్పర్ట్ అడ్వైజరీ ప్యానెల్) పని చేయాలని కోరింది. నాలుగేండ్లపాటు ఆ పదవిలో కొనసాగాలని సూచించింది.
రాంకిషన్ ప్రస్తుతం కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్గా పనిచేస్తున్నారు. హైదరాబాద్లోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) జోనల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ, తెలంగాణ, ఏపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ రంగంలో ఆయనకు 25 ఏండ్ల అనుభవం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నియమించిన అనేక సాంకేతిక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. అనేక రాష్ర్టాల డ్రగ్స్ అడ్వైజరీ బోర్డుల్లో సభ్యుడిగా సేవలు అందించారు. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ 35 అవార్డులు అందుకున్నారు. 18 దేశాల్లో జరిగిన సమావేశాల్లో మన దేశం తరఫున పాల్గొన్నారు.
రాంకిషన్ పేరు మీద రెండు పేటెంట్లు ఉన్నాయి. 41 పరిశోధన పత్రాలను సమర్పించారు. ఇందులో 20 అంతర్జాతీయ పరిశోధనలు కావడం విశేషం. ఆయన పనితీరు, పరిశోధనలు, ఔషధ రంగంలో ఆయనకున్న పరిజ్ఞానాన్ని ప్రంపచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. తమతో కలిసి పని చేయాలని రెండేండ్ల కిందట ఆహ్వానం పలికింది. ఆ తర్వాత వివిధ దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి, చివరికి నిపుణుల కమిటీలో చోటు కల్పించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సైతం తెలిపింది. కేంద్రం నుంచి అనుమతి తీసుకొని నాలుగేండ్లపాటు తమ కమిటీలో పనిచేయాలని రాంకిషన్ను కోరింది. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేయనున్న తొలి తెలంగాణ వ్యక్తిగా రాంకిషన్ నిలువబోతున్నారు.