హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ)/మలక్పేట: డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తెలిపారు. దివ్యాంగుల దినోత్సవ ఏర్పాట్లపై సోమవారం ఆయన మలక్పేటలోని కార్పొరేషన్ కార్యాలయంలో సంస్థ ఎండీ శైలజతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల నిర్వహణకు జిల్లాకు రూ.50 వేల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. దివ్యాంగులకు రన్నింగ్, షాట్ఫుట్, చెస్, జావెలిన్త్రో, క్యారమ్స్, వీల్చైర్ రేస్ తదితర పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని వివరించారు. సమావేశంలో సంస్థ జీఎం ప్రభంజన్రావు, ఏడీ రాజేందర్, దివ్యాంగుల సంఘాల నాయకులు నారా నాగేశ్వర్రావు, నల్లగొండ శ్రీను, గంగారాం తదితరులు పాల్గొన్నారు.