హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘డియర్ స్టూడెంట్.. మీరు ప్రవేశం పొందిన కాలేజీలోని కోర్సులో 15 మంది లోపు విద్యార్థులు మాత్రమే చేరారు. నిబంధనల ప్రకారం ఆ కోర్సును ఫ్రీజ్ చేయాల్సి ఉన్నది. కావున మరో కాలేజీలో చేరండి’ డిగ్రీ ఫస్టియర్లో చేరిన కొందరు విద్యార్థులకు దోస్త్ పంపిన ఎస్ఎంఎస్ సారాంశం ఇది. డిగ్రీ ఫస్టియర్లో 15లోపు విద్యార్థులున్న కోర్సులను ఫ్రీజ్ చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఈ ఏడాది 1.96లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు పొందారు. అయితే పలు కాలేజీల్లో 15మందిలోపు విద్యార్థులు మాత్రమే చేరిన కోర్సులున్నాయి. ఈ కోర్సులను నడపడం అసాధ్యం. కావున ఆయా కోర్సులు, సెక్షన్లను ఫ్రీజ్ చేసే ప్రక్రియలో భాగంగా విద్యార్థులు మరో కాలేజీలో చేరేందుకు అవకాశం కల్పించారు. విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఇలా సర్దుబాటు చేసినట్టు దోస్త్ అధికారులు వెల్లడించారు.