హైదరాబాద్, ఏప్రిల్ 27, (నమస్తే తెలంగాణ): కరోనా వేళ వైద్యసహాయం కోసం గూగుల్లో సెర్చ్ చేస్తున్నారా? అంబులెన్స్ కోసమో, ఐసీయూ బెడ్ కోసమో గూగుల్లో చూపే నంబర్కు ఫోన్ చేస్తున్నారా? జాగ్రత్త సుమా! బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు డబ్బులు దండుకొంటున్నారు. వైరస్ బారినపడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్న తమవారిని కాపాడుకోవాలన్న తొందరలో కొందరు గూగుల్లో వైద్యం, ఐసీయూ బెడ్లు, అంబులెన్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు సైబర్ దొంగలు.. తమ ఫోన్ నంబర్లు పెట్టి, ముందుగా కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా పే చేయాలని అడుగుతున్నారు. ఆ మొత్తం కట్టి వాళ్లు చెప్పిన దవాఖానకు వెళ్తే అసలు విషయం బయటపడుతోందని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఫిర్యాదులు చాలా అందాయని వెల్లడించారు. గూగుల్లో ఉండే ఫోన్ నంబర్లను నమ్మి మోసపోవద్దని, ఆయా దవాఖానల, మెడికల్ కంపెనీల అధికారిక వెబ్సైట్లలోకి వెళ్లి కాంటాక్ట్ నంబర్లు తీసుకోవటం ఉత్తమమని సూచించారు. కరోనా రోగులు బంధువులు ముందుగానే సమాచారం సేకరించుకోవాలని పోలీసులు పేర్కొన్నారు.