మలక్పేట, సెప్టెంబర్ 3 : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేస్తే ఊరుకునేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రూ.8 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలను చెల్లించటానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎందుకు భయమని ప్రశ్నించారు. గురువారం దిల్సుఖ్నగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేతలు ఎన్ వెంకటేశ్, అనంతయ్య, మోదీ రాందేవ్ నాయకత్వంలో గడ్డిఅన్నారం చౌరస్తా నుంచి దిల్సుఖ్నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వరకు వందలాదిమంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రలు చేస్తున్నదని, దీనిపై అసెంబ్లీలో నిలదీయాలని ప్రతిపక్షాలను, పాలకపక్షాల సభ్యులను కోరారు. మూడేండ్లుగా ఫీజు బకాయిలు పేరుకుపోతున్నప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోవటంలేదని, దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అసెంబ్లీలో పోరాడకపోతే భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఆలేరు టౌన్, సెప్టెంబర్ 3 : దళిత బంధు పథకానికి బదులుగా అంబేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12 లక్షలిస్తామని చెప్పి, ఇప్పటివరకు కనీసం 12 మందికైనా ఆర్థిక సాయం అందించారా? అని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హామీలను అమలు చేయకుండా దళితులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం ఆయన యాదాద్రి జిల్లా ఆలేరులో మీడియా తో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యంగా అంబేద్కర్ అభయహస్తం కింద అర్హులైన దళితులకు రూ.12 లక్షల చొప్పున వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇదే డిమాండ్పై అక్టోబర్లో టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహాదీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు.