నిజామాబాద్ : స్వాతంత్య్ర సమరయోధులను పోరాట పటిమను గుర్తుచేసుకునేలా వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
స్వాతంత్య్ర వేడుకలను జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహనీయుల వీరోచిత పోరాటం, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు.
పక్షం రోజుల పాటు కొనసాగిస్తున్న స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుక కార్యక్రమాలు ప్రజల్లో జాతీయతా స్ఫూర్తిని పెంపొందిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. గాంధీజీ చూపిన అహింసా మార్గంలో ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ముందుకు నడిపించి ప్రత్యేక రాష్ట్రం సాధించారని పేర్కొన్నారు.
ఈ నెల 15న ప్రతి పల్లెలో ప్రతి ఇంటిపై మన త్రివర్ణ పతాకం ఎగరవేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆకుల లలిత, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.