హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగించవద్దని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో నేటితో లాక్డౌన్ ముగియనున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్, వానాకాలం సాగు, తదితర అంశాలపై తెలంగాణ మంత్రివర్గం సమావేశమై చర్చిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. లాక్డౌన్పై నా వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నాను. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు లాక్డౌన్ పరిష్కారం కాదు. దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయి.
లాక్డౌన్ కంటే ముందే కొవిడ్ కేసులు తగ్గుతున్నట్లు ఇప్పటికే వివరాలు స్పష్టం చేస్తున్నాయి. లాక్డౌన్ వల్లే కేసులు తగ్గలేదు. లాక్డౌన్ లేకపోయినప్పటికీ కొవిడ్ను ఎదుర్కోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. మహమ్మారిపై సుధీర్ఘ పోరాటం చేయాలన్న వాస్తవాన్ని అందరమూ అంగీకరించాలి. మాస్కుల వినియోగం, భౌతికదూరంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారానే పోరాడవచ్చు. అందుకు అనుగుణమైన జీవనవిధానం ఉండేలా ప్రభుత్వాల విధానాలు ఉండాలి.
మహమ్మారికి ధీర్ఘకాలిక పరిష్కారం వ్యాక్సినేషన్ మాత్రమే. లాక్డౌన్ వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహమ్మారి, పేదరికం, పోలీసుల వేధింపులతో చాలా ఇక్కట్లలో పడతారు. ప్రజారోగ్య సంక్షోభాన్ని ప్రభుత్వాలు శాంతి, భద్రతల సమస్యగా మారుస్తున్నాయి. ఇది ఎంత మాత్రం శాస్త్రీయ, మానవతా ధృక్పథం కాదు. లాక్డౌన్ను పొడిగించవద్దని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నా. జనసమ్మర్దాన్ని తగ్గించాలనుకుంటే సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ విధించాలి. లేదా కొవిడ్ క్లస్టర్లలో మినీ లాక్డౌన్ విధించాలి. అంతేకానీ కేవలం 4 గంటల సడలింపులతోనే 3.5 కోట్ల మంది జీవనం వారాల పాటు కొనసాగించాలని భావించడం తగదని ఆయన పేర్కొన్నారు.