Cyber Crime | గేమింగ్ యాప్స్, ఫొటో ఎడిటింగ్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్.. ఆఖరుకు స్మార్ట్వాచ్ యాప్లు సైతం మన డాటా దోచుకుని సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నాయనే విషయం మీకు తెలుసా? డార్క్వెబ్లో ఇలాంటి దందా సర్వసాధారణమైనదనే విషయం మీకు ఎరుకేనా? అదెలా అంటే.. కొత్త యాప్లు, కొత్త పోకడలకు అలవాటు పడి అడిగినంత సమాచారాన్ని తీసుకొమ్మని మనమే ‘అనుమతి’ ఇస్తున్నాం మరి.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కొత్త ఫీచర్స్తో అలరించే యాప్స్, ఏపీకే ఫైల్స్ మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి. గతంలో ఏవైనా యాప్స్ డౌన్లోడ్ చేసి, దానిని ఇన్స్టాల్ చేసిన తర్వాత.. ఓపెన్ చేయడానికి పరిమితమైన నిబంధనలే ఉండేవి. కొన్ని ఎలాంటి నిబంధనలు పెట్టకుండానే తమ సేవలు అందించేవి. కానీ, నేడు ఒక్కో వ్యక్తి వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, కాంటాక్ట్స్ వంటివి విలువైన సంపదగా మారాయి. ఈ కొత్త సంపద ఎవరిదగ్గర ఎంత ఎక్కువగా ఉంటే వారే రిచ్చెస్ట్ పర్సన్. సైబర్ నేరగాళ్లు ఆ డాటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విశ్లేషించి, ఎవరిని ఎలా బుట్టలో వేయొచ్చో తెలుసుకొని, అనువై న ఎరను సిద్ధం చేసి.. అందినకాడికి డబ్బు లు దోచుకుంటున్నారు. ఇదే ప్రస్తుతం కొనసాగుతున్న సైబర్ క్రైమ్ ట్రెండ్.
అనుమతులిచ్చేది మనమే!
థర్డ్ పార్టీ యాప్స్ను ఇన్స్టాల్ చేసినప్పుడు దాన్ని ఓపెన్ చేసే క్రమంలో గుడ్డిగా మనం తెలిపేది అంగీకారమే. ఆ అంగీకారమే మనకు, మన కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి, మనతో కలిసి ఫొటోలు దిగిన వారికి నరకాన్ని చూపిస్తున్నాయి. ఉదాహరణకు.. ఒక స్మార్ట్ బ్యాండ్ గ్యాడ్జెట్ను యాక్టివేట్ చేయడానికి దాని ‘షరతులు, ఇతర నిబంధనలు’ పూర్తిగా చదవకుండానే ‘ఐ అగ్రి/యాక్సెప్ట్’ను క్లిక్ చేస్తాం. ఒక్కసారి ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫొటోలు, వీడియోలు, రికార్డింగ్ ఆడియోలు మేనేజ్ చేసేందుకు ‘అలౌ’ నొక్కాలి. మనం ఎక్కడున్నదీ లొకేషన్ పర్మిషన్ ఇవ్వాలి. మొత్తానికి మన ఫోన్ స్టోరేజ్ను కాపీ చేసుకునేందుకు, మేనేజ్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలి. వరుసగా పర్మిషన్లు ఇస్తూ.. ‘అలౌ’ క్లిక్ చేస్తేనే దానిని ఓపెన్ చేయగలం. పొరపాటు ‘డినే’ బటన్ నొక్కినా, స్కిప్ చేసినా.. అప్పటి నుంచి ముందుకు వెళ్లని పరిస్థితి.
గుడ్డిగా అంగీకరించొద్దు
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత డాటాను భద్రపరుచుకోవడం కష్టంగా మారింది. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ను ఇన్స్టాల్ చేసి, ఓపెన్ చేసేటప్పుడు ఫొటోలు, వీడియోలు కాంటాక్ట్స్, ఆడియో రికార్డింగ్స్ అడుగుతున్నారంటే మోసం జరుగుతున్నట్లు గుర్తించాలి. గుడ్డిగా అంగీకారం తెలిపితే నష్టపోయేది మనమే. ఒకసారి సమాచారం వారికి ఇచ్చామంటే మన కాంటాక్ట్స్ లిస్టులో ఉన్న వారికి నిత్యం సైబర్ ఫిషింగ్స్, స్ఫూప్డ్ మెయిల్స్, అడ్డగోలు అడ్వైర్టెజ్మెంట్లు, అన్వాంటెడ్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ప్రమాదకరమైన థర్డ్ పార్టీ యాప్స్ వల్ల సైబర్ నేరాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తపడాలి. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయండి. దగ్గరలోని పోలీస్ స్టేషన్లో 24 గంటలలోపు ఫిర్యాదు చేయండి.
– అనిల్ రాచమళ్ల, సైబర్ నిపుణుడు, ఎండ్ నౌ ఫౌండేషన్