Donald Trump | వాషింగ్టన్, జనవరి 24: రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే గత వారం జరిగిన అయోవా కాకస్ ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన మాజీ అధ్యక్షుడు.. తాజాగా న్యూ హ్యాంప్షైర్ రిపబ్లికన్ ప్రైమరీలోనూ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీపై ట్రంప్ గెలిచారు. ట్రంప్నకు దాదాపు 55 శాతం ఓట్లు రాగా.. సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కి హేలీకి 43 శాతం ఓట్లు దక్కాయి.
ఇప్పటికి కేవలం రెండు రాష్ర్టాల్లో మాత్రమే రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికలు జరిగినప్పటికీ.. ట్రంప్కు ఇప్పటికే దక్కిన విజయాలు రిపబ్లికన్ పార్టీలో ఆయన ఆధిపత్యాన్ని చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే కుట్రతో సహా 91 క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటునప్పటికీ.. ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకుపోతుండటం గమనార్హం. అయితే రేసు అయిపోలేదని, ఇంకా చాలా రాష్ర్టాలు ఉన్నాయని నిక్కీ హేలీ పేర్కొన్నారు. ‘నేను ఒక ఫైటర్ని. పోరాటం కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో వివేక్ రామస్వామితో సహా ఇతరులు తప్పుకోవడంతో.. ట్రంప్, నిక్కీ హేలీ మాత్రమే పోటీలో నిలిచారు. మరోవైపు ఎలాంటి ప్రచారం లేకుండానే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ న్యూ హ్యాంప్షైర్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ట్రంప్, బైడెన్ మధ్యనే పోటీ జరిగే అవకాశం కనిపిస్తున్నది.