హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సెన్సార్ లేకుండా బిగ్బాస్ షో టీవీల్లో ప్రసారం అవుతూ అసభ్య, అశ్లీల అంశాలను చూపిస్తున్నారని 2019లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైతే.. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు కేంద్రప్రభుత్వానికి మూడేండ్లుగా తీరిక లేదా? అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సామాజిక బాధ్యతతో స్పందించే తీరిక కూడా లేదా అని మండిపడింది. బిగ్బాస్ లాంటి షోల కట్టడికి కేంద్ర సరారు ఎందుకు చర్యలు తీసుకోవటంలేదని ప్రశ్నించింది. జనంలో చైతన్యం లేదనుకోవద్దని హెచ్చరించింది. బిగ్బాస్ షోపై నియంత్రణలు విధించాలని సినీ నిర్మాత కే జగదీశ్వర్రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ఏపీ హైకోర్టు శుక్రవారం మరోసారి విచారించింది.
కేంద్రం కౌంటర్ వేయకపోవడంపై న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ డీ వెంకటరమణతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. బిగ్బాస్షో వల్ల యువత పెడదారిపడుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది జీ శివప్రసాద్రెడ్డి వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. నైతిక విలువలతో కూడిన కార్యక్రమాలు గతంలో టీవీల్లో వచ్చేవని, ఇప్పుడు కుటుంబ కలహాలు, హింస, హత్యలు, కుట్రలతో కూడిన సీరియల్స్ వస్తున్నాయని వ్యాఖ్యానించింది. బిగ్బాస్ షో కట్టడికి కేంద్రం చర్యలు తీసుకొంటుందో లేదో చెప్పాలని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర హోం, సమాచార, మహిళా, శిశు సంక్షేమ శాఖల కార్యదర్శులకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది.