హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకరమే అయినా, ఇప్పటికీ డెల్టానే ప్రమాదకారి అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) గురువారం ‘ఒమిక్రాన్’ వేరియంట్ ప్రభావంపై వెబినార్ నిర్వహించింది. ఇందులో ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్లో ఇప్పటివరకు 32 ఉత్పరివర్తనాలు గుర్తించారని, దీనిపై ఇంకా శాస్త్రీయ పరిశోధనలు జరుగాల్సి ఉన్నదని చెప్పారు. ఒమిక్రాన్ ప్రభావం తక్కుగానే ఉన్నా, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని తెలిపారు. వరంగల్ నిట్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెరుగు శ్యామ్ మాట్లాడుతూ ఉత్పరివర్తనాల సంఖ్య ఎక్కువగా ఉన్నంత మాత్రాన వైరస్ ప్రమాదకరంగా మారుతున్నట్టు కాదని పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ను అడ్డుకొనేందుకు బూస్టర్ డోస్ ఒక ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తున్నదని, అందువల్ల ప్రభుత్వాలు మూడో టీకా పంపిణీపై దృష్టిపెట్టాయని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ సీఈవో ఖ్యాతి నరవణె, ప్రెసిడెంట్ భాస్కర్రెడ్డి, సీనియర్ వైస్ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.