హిమాయత్నగర్, ఏప్రిల్ 11: దళితుల అభ్యున్నతి, సామాజిక వికాసం, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం కేటాయించే ఎస్సీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించకుండా వారి సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని దళిత క్రిస్టియన్ దండోరా జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్, విశ్వజన కళామండలి జాతీయ అధ్యక్షుడు మాస్టార్జీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచంలోని దళితులు సకల రంగాల్లో వికాసం కోసం జై భీమ్ గ్లోబల్ కమ్యూనిటీ నెట్వర్క్ యాప్ను గురువారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో వారు ఆవిష్కరించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 20 వరకు సబ్ప్లాన్ విధి విధానాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ చదివే దళిత విద్యార్థులు వ్యాస రచనలు రాసి 9912043013 నంబర్కు వాట్సాప్ పంపించాలని పేర్కొన్నారు. సమావేశంలో యాప్ వ్యవస్థాపకుడు రమేశ్, మిక్కి రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్గాంధీ, న్యాయవాది ప్రవీణ్కుమార్, అరుంధతీయ బంధు సేవామండలి నగర ప్రధాన కార్యదర్శి పవన్కుమార్, సహాయ కార్యదర్శి జేవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.