నియోనటల్ ఇక్తియోసిస్ స్కాల్ప్ అలోపేసియా చోలాంగియో హైపటైటిస్- నోరు తిరగని పేరున్న జబ్బు .. ఆ పేద కుటుంబంలో కల్లోలం రేపింది. కండ్లముందు పసిబిడ్డ పడుతున్న యాతన చూసి ఆ తల్లిదండ్రులు రోదించని క్షణం లేదు. ప్రారంభంలో పసరికలేనని భావించినా చిట్టి ప్రాణానికి పెద్దజబ్బే వచ్చిందని తెలిసిన తర్వాత.. వారి ఆశల హర్మ్యాలు కండ్లముందే కూలిపోయాయి. కారుచీకటిలో కాంతిరేఖలా ఉస్మానియా దవాఖాన వారికి కనిపించింది. రెండునెలల శ్రమించిన వైద్యబృందం.. అంతర్జాతీయ నిపుణులను సంప్రదించింది. మెడికల్ జర్నల్స్ను జల్లెడ పట్టింది. పసిమోములో చిరునవ్వుల్ని తిరిగి తీసుకొచ్చింది. సర్వశక్తులూ ధారపోసిన డాక్టర్లు.. చిన్నారి శివాన్ష్కు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఆ వైద్యులు యోధులే. కండ్లముందు కదలాడే దేవతలు. ప్రాణప్రదాతలు.
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) / సుల్తాన్బజార్: జగిత్యాల జిల్లా బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన ప్రేమలత, నారాయణ దంపతులకు పదినెలల క్రితం రెండో సంతానంగా శివాన్ష్ పుట్టాడు. ప్రేమలత అంగన్వాడీ కార్యకర్త కాగా, నారాయణ వ్యవసాయ కూలీ. తొలిచూరు బిడ్డ పురిట్లోనే మరణించిన తర్వాత.. శివాన్ష్ పుట్టడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. అయితే అది కొద్దిరోజులు మాత్రమే. ఆరు నెలలకే చిన్నారిలో ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి.
చర్మం మొత్తం పొడిబారి, పొలుసులు రాలటం ప్రారంభమైంది. జుట్టు ఊడిపోతున్నది. ఎదుగుదల లేదు. రెండు మూడు రోజుల్లోనే చనిపోయిన మొదటి బిడ్డలోనూ ఇలాంటి లక్షణాలే కనిపించిన విషయం గుర్తుకొచ్చి ప్రేమలత, నారాయణ దంపతుల వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే హైదరాబాద్లోని నిలోఫర్ దవాఖానకు శివాన్ష్ను తీసుకొచ్చారు. మొదట్లో పసరికలు (జాండిస్) అని భావించిన వైద్యులు.. ఆ మేరకు రెండు వారాలపాటు చికిత్స అందించారు. ఫలితం లేకపోగా, శివాన్ష్ ఆరోగ్యం మరింత క్షీణించింది. మరోమారు వైద్యపరీక్షలు జరిపిన నిలోఫర్ వైద్యులు జన్యువ్యాధి లక్షణాలున్నట్టు గుర్తించారు. దీంతో పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ ఉషారాణి శివాన్ష్ను ఉస్మానియా దవాఖానకు రెఫర్ చేశారు.
శివాన్ష్ను పరిశీలించిన ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్.. అత్యంత అరుదైన ‘నియోనటల్ ఇక్తియోసిస్ స్కాల్ప్ అలోపేసియా చోలాంగియో హైపటైటిస్’ అనే జన్యువ్యాధిగా గుర్తించారు. దానినే నిష్ (NISCH) సిండ్రోమ్ అని పిలుస్తారు. మేనరిక వివాహాల వల్ల ఇలాంటి వ్యాధి వస్తుంది. ప్రేమలత, నారాయణది కూడా మేనరిక వివాహమే. మనదేశంలో నిష్ సిండ్రోమ్ కేసు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో ఉస్మానియా వైద్యబృందానికి కొత్త సవాల్ ఎదురైంది. ప్రపంచంలో ఇలాంటి కేసులు ఎక్కడెక్కడ వెలుగులోకి వచ్చాయో ఆరా తీశారు. ఇప్పటివరకు 18 నిష్సిండ్రోమ్ కేసులు నమోదైనట్టు గర్తించారు. వీరిలో 14మంది చికిత్స మధ్యలోనే మరణించగా, నలుగురికి మాత్రం కాలేయమార్పిడి చేసినట్టు తేలింది. నలుగురికి చికిత్స అందించిన వైద్యులను సంప్రదించేందుకు ఉస్మానియా డాక్టర్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో డాక్టర్ మధుసూదన్ కాలేయ మార్పిడి చికిత్స చేసే అంతర్జాతీయ వైద్య నిపుణుల వాట్సాప్ గ్రూప్లో చిన్నారి శివాన్ష్ పరిస్థితిని వివరిస్తూ పోస్ట్ చేశారు. దీన్ని చూసిన మొరాకో డాక్టర్ ఒకరు.. తాను గతంలో నిష్ సిండ్రోమ్ బాధితుడికి శస్త్రచికిత్స చేశానని తెలిపారు. దీంతో ఉస్మానియా వైద్యబృందానికి ఆశలు చిగురించాయి. ఆయనను సంప్రదించగా.. తాను చికిత్స చేసిన విధానాన్ని మాత్రమే ఆయన వివరించారు. శివాన్ష్ విషయంలో వ్యాధి లక్షణాలు మరింత జటిలంగా ఉండటంతో.. ఎలా ఆపరేషన్ చేయాలో ఆయన చెప్పలేకపోయారు.
గతంలో నిష్ సిండ్రోమ్ సోకిన చిన్నారులకు కాలేయ మార్పిడి జరిగిన తర్వాత జుట్టు రాలేదు. కానీ శివాన్ష్ విషయంలో అలా జరుగలేదు. జుట్టు ఆరోగ్యంగా రావడం మొదలైంది. చర్మం తిరిగి మామూలుగా అవడం ప్రారంభించింది. సొంతంగా తల్లిపాలు తాగగలుగుతున్నాడు. ఈ రెండున్నర నెలల కాలంలో ఉస్మానియా బృందం ఆ చిన్నారికి ప్రాణం మాత్రమే పోయలేదు.. ప్రేమను పంచారు. నర్సింగ్ సిబ్బంది ఆ చిన్నారికి తల్లితో సమానంగా పరిచర్యలు చేశారు, లాలించారు. డాక్టర్లు తమ కుటుంబంలో ఒకడిగా బాగోగులు చూసుకున్నారు.
దాదాపు రెండున్నర నెలల అనంతరం గురువారం చిన్నారి శివాన్ష్ను డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా సిబ్బంది ఆనందంతో బాలుడికి వీడ్కోలు పలుకుతూ పలుకగా, తల్లిదండ్రులు ప్రేమలత, నారాయణ భావోద్వేగానికి గురయ్యారు. సర్జరీ చేసిన వైద్యులు, నర్సింగ్, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు సహాయం అందించినందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దవాఖానలో అన్ని వసతులను కల్పించిన ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
శివాన్ష్కు చికిత్సను అందించిన వైద్యసిబ్బందిని ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్ అభినందించారు. దవాఖాన చరిత్రలో ఇది మరో మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ఈ అరుదైన ఆపరేషన్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం నుంచి డాక్టర్ సీహెచ్ మధుసూదన్, వాసిఫ్ అలీ, సుదర్శన్, ఆదిత్య, వరుణ్, వేణు, అమర్దీప్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండునాయక్, మాధవి, వెంకటేశ్వర్లు, సునీల్, హరీశ్, గ్యాస్ట్రోఎంటరాలజీ నుంచి డాక్టర్ రమేశ్ కుమార్, ఉమాదేవి, నిలోఫర్ పీడియాట్రిక్ విభాగం నుంచి డాక్టర్ ఉషారాణి, నర్సింగ్ సూపరింటెండెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది జూన్ 17… శివాన్ష్కు సర్జరీ చేసే రోజు రానే వచ్చింది. డాక్టర్లు, పీజీ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది కలిపి మొత్తం 30 మంది సభ్యుల బృందం ఆపరేషన్ థియేటర్కు చేరుకున్నది. రెండు బృందాలుగా విడిపోయింది. ఒక బృందం తల్లి నుంచి కొంత కాలేయాన్ని తీస్తే.. మరో బృందం ఆ చిన్నారి శరీరంలోని చెడిపోయిన కాలేయాన్ని తొలగించింది. ఇక్కడే మరో సమస్య వచ్చిపడింది. శివాన్ష్లో కాలేయానికి రక్తం సరఫరా చేసే ధమని ఒకటి ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
అప్పటికప్పుడు వేగంగా చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. తల్లి నుంచి తీసిన కాలేయాన్ని జాగ్రత్తగా శివాన్ష్కు మార్పిడి చేశారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మొత్తం పద్దెనిమిదిన్నర గంటలు పట్టింది. అప్పటివరకు సిబ్బంది మొత్తం ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నారు. అవిశ్రాంతంగా శ్రమించి ఆ చిన్నారికి ప్రాణం పోశారు.
శివాన్ష్ బతకాలంటే కాలేయ మార్పిడి ఒక్కటే మార్గం. కాలేయం ఇచ్చేందుకు తల్లి ముందుకొచ్చింది. ఉస్మానియా డాక్టర్లకు 10 నెలల వయసు ఆరేడు కిలోల బరువున్న చిన్నారులకు గతంలో సర్జరీలు చేసిన అనుభవం ఉన్నా.. శివాన్ష్ ప్రత్యేకం. ‘చర్మం ముట్టుకుంటే పొలుసులా వస్తున్నది. సర్జరీ కోసం కట్ చేస్తే మళ్లీ అతుక్కుంటుందో లేదో తెలియదు. పొట్ట మొత్తం ఉబ్బిపోయింది. రక్తనాళాలు మిల్లీ మీటర్ మందంలో ఉన్నాయి. మత్తుమందు ఏ మోతాదులో ఇస్తే ఏం జరుగుతుందో తెలియదు. అంతర్జాతీయంగా ఎక్కడ వెతికినా రెఫరెన్స్ దొరుకని పరిస్థితి.
దీంతో సొంతంగా పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాం’అని డాక్టర్ మధుసూదన్ తెలిపారు. శివాన్ష్ కోసం మొదటిసారిగా ఉస్మానియా, నిలోఫర్ డాక్టర్లు ఏకమయ్యారు. ఉస్మానియా నుంచి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, డెర్మటాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, అనస్థీషియా, నిలోఫర్ పీడియాట్రిక్ విభాగం నుంచి మొత్తం 20 మంది వైద్యుల బృందం దాదాపు నెలన్నరపాటు విస్తృతంగా చర్చించింది. గంటలపాటు సమావేశాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు జరిగాయి. ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి.. ఆ చిన్నారి పరిస్థితిని, రిపోర్టులను ఎప్పటికప్పుడు అందులో పంచుకున్నారు. వాటిపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు.