హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కరోనా పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణను సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ మున్సిపల్ ఎన్నికలను పూర్తిచేయాలని, ఓటర్లు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, మద్యం అమ్మకాలను మే 3 వరకు కట్టడిచేయాలని చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసింది.
కర్ఫ్యూపై నేడు సీఎస్ సమీక్ష
రాత్రి కర్ఫ్యూపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈనెల 30తో రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ముగుస్తుందని, ఆ తరువాత ప్రభుత్వం ఏం చేస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ ఈ అంశంపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని చెప్పారు. రాత్రి కర్ఫ్యూని కొనసాగిస్తారా? లేక లాక్డౌన్ ప్రకటిస్తారా? అనే ప్రశ్నకు ఈ విషయాన్ని సలహా కమిటీ సూచనలకు అనుగుణంగా సీఎస్ నిర్వహించే సమావేశం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయితే రాత్రి కర్ఫ్యూ అంశంపై ఏ నిర్ణయం తీసుకుందో శుక్రవారం జరిగే విచారణలో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.