హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 96 మంది జర్నలిస్టుల కుటుంబాలకు బుధవారం ఆర్థికసాయం చెక్కులను పంపిణీ చేయనున్నారు. గత ఏడేండ్లలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు, నిస్సహాయ స్థితిలో ఉన్న విలేకరులకు రాష్ట్ర ప్రభుత్వం ‘సంక్షేమ నిధి-పాత్రికేయుల పెన్నిధి’ పేరిట ఆర్థికసాయం చేస్తున్నది. రూ.42 కోట్ల జర్నలిస్టుల సంక్షేమ నిధి మూలధనంపై వచ్చిన వడ్డీతో మీడియా అకాడమి ఏటా ఆర్థికసాయం అందజేస్తున్నది. బుధవారం ఉదయం హైదరాబాద్లోని హోటల్ టూరిజం ప్లాజాలో పర్యాటక, పురావస్తు, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేయన్నారు.
మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్రెడ్డి, జర్నలిస్టు సంఘాల నేతలు అతిథులుగా పాల్గొననున్నారు. నేడు లబ్ధి పొందనున్న 96 జర్నలిస్టు కుటుంబాలను కలుపుకొని మొత్తం 672 కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసి నట్టవుతుంది. ఒక్కో కుటుంబానికి రూ.లక్షతో పాటు, ఐదేండ్లపాటు నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్నారు. నిస్సహాయులైన జర్నలిస్టులకు రూ.50 వేల ఆర్థికసాయం అందిస్తున్నారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలు ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదువుకోవడానికి ట్యూషన్ ఫీజు కోసం ఒక్కొక్కరికి నెలకు రూ.1000 చొప్పున మీడియా అకాడమి అందజేస్తున్నది.