హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను బలహీనపడింది. తీవ్ర తుఫాను క్రమంగా తగ్గుముఖం పట్టిందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని వివరించింది. మరికొన్ని గంటల్లో ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకొనే అవకాశం ఉన్నదని వెల్లడించింది. అనూహ్యంగా దిశ మార్చుకొన్న అసని ఈ శాన్యం వైపు కదులుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ మేరకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
ఈ నెల 15 వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. అటు.. తుఫాను ప్రభావంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. మంగళవారం వరకు ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలు.. వాతావరణం చల్లబడటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకొన్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 జిల్లాల్లో 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొన్నది. మంగళవారం 13 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం తిమ్మాపూర్లో 1.53 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తుఫాను ప్రభావం కనిపిస్తున్నది. ఏపీకి వెళ్లే 37 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.
‘అసన్’ ప్రభావంతో చిరుజల్లులు
అసన్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. బుధవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో సాయంత్రం 3.18 సెం.మీ. వర్షం కురిసింది. సుమారు గంటపాటు ఎడతెరిపి లేకుండా కురువగా.. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో తుంపర్లతో కూడిన వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలంలో 8.8 మిల్లీమీటర్లు, ఆత్మకూర్(ఎస్)లో 7, నేరేడుచర్లలో 6.6, పాలకవీడులో 6.3, పెన్పహాడ్లో 4.8, చివ్వెంలలో 4.1, గరిడేపల్లి మండలంలో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. వలిగొండ మండలంలో 2.3 మిల్లీమీటర్లు, రామన్నపేట 1.6, మోత్కూర్లో 1.3 వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లాలోనూ అక్కడక్కడ చిరు జల్లులు పడ్డాయి.
సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన విదేశీ మందిరం
తుఫాను కారణంగా వేరే దేశానికి చెందిన ఓ మందిరం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండ లం సున్నాపల్లి రేవుకు కొట్టుకువచ్చింది. బంగారు వర్ణం కలిగిన ఈ మందిరంపై 16-1-2022 అని విదేశీ భాషలో రాసి ఉన్నది. ఇది మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్కు చెందినదై ఉండొచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు. ఇంతవరకు తిత్లీ వంటి పెద్ద తుఫాన్లు వచ్చినా ఇలాంటివి సముద్రంలో కొట్టుకురాలేదని తెలిపారు. ఈ మందిరాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అది ఎక్కడి నుంచి కొట్టుకువచ్చిందన్నది తెలియాల్సి ఉన్నది.