హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర సోలార్ విద్యుత్తు కొనుగోళ్లు డిస్కమ్లకు గుదిబండగా మారుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్తో డిస్కమ్ మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘కరెంట్ వచ్చేదెప్పుడో.. కానీ భారం ఇప్పటి నుంచే’ అన్నట్టుగా ఉన్నదని, అంతిమంగా ఇది వినియోగదారులపై తీవ్రభారం మోపే ఒప్పందమని, దీనిని ఈఆర్సీ తిరస్కరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మూడు సంస్థల నుంచి 2,545 మెగావాట్ల సోలార్ విద్యుత్తును 25 ఏండ్ల కాలానికి కొనుగోలు చేసేందుకు డిస్కమ్లు రెడీ అయ్యాయి. ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఇటీవలే తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ)కి దరఖాస్తు చేశాయి.
మరోవైపు 2,545 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను ఆమోదించవద్దని విద్యుత్తురంగ నిపుణులు, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాలరావు ఈఆర్సీని కోరారు. ఈ మేరకు లిఖితపూర్వక అభ్యంతరాలను ఈఆర్సీకి సమర్పించారు. ఈ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో ఆలస్యాలు, టారిఫ్ పెంపులు, ట్రాన్స్మిషన్ చార్జీలు, ట్రేడింగ్ మార్జిన్, సరఫరా లోపాలు వంటి సమస్యలొస్తాయని ఆయన అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఇది డిస్కమ్లకే కాకుండా విద్యుత్తు వినియోగదారులపై దీర్ఘకాలిక ఆర్థిక భారంగా మారే ప్రమాదమున్నదని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాలను యథాతథంగా ఆమోదించకుండా, వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేలా నిబంధనలు సవరించాలని ఆయన కోరారు.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) నుంచి 1,045, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) నుంచి 500, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెకి) నుంచి 1,000 మెగావాట్లు కలిపి మొత్తం 2,545 మెగావాట్లను 25 ఏండ్ల కాలానికి కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. అయితే 2025 నవంబర్ 10 నాటికి 1,288.3 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు మాత్రమే కమిషన్ అయ్యాయి. మరో 1,256.7 మెగావాట్లు ఇంకా కమిషన్ కావాల్సి ఉన్నది. అంతేకాకుండా కమిషన్ అయిన ప్లాంట్ల నుంచి కూడా డిసమ్లకు విద్యుత్తు సరఫరా ప్రారంభం కాలేదని కనుక ఇందుకు అనుమతినివ్వవద్దని వేణుగోపాలరావు ఈఆర్సీని కోరారు. మధ్యవర్తి సంస్థలకు యూనిట్కు 7 పైసల ట్రేడింగ్ మార్జిన్ చెల్లించే నిబంధనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2,545 మెగావాట్ల సౌర విద్యుత్తును 25 ఏండ్లపాటు కొనుగోలు చేస్తే డిసమ్లు సుమారు రూ.741.25 కోట్లు ట్రేడింగ్ మార్జిన్ రూపంలో చెల్లించాల్సి వస్తుందని ఆయన ఆరోపించారు. పక్క రాష్ట్రం ట్రేడింగ్ మార్జిన్ వేరుగా ఉన్నదని, దీనిని యూనిట్కు 7 పైసలు కాకుండా కెపాసిటీ చార్జీలపై 0.5 శాతంగా పరిమితం చేయాలని కోరారు.