హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పనితీరు ఆదర్శనీయంగా ఉన్నదని జార్ఖండ్ వాణిజ్య పన్నుల శాఖ అధికారుల బృందం ప్రశంసించింది. ఆ శాఖ ఆదాయం ఎనిమిదేండ్లలోనే ట్రిపుల్ కావడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపింది. తెలంగాణలోని విధానాలు తమకెంతో ఉపయోగపడతాయని, తమ రాష్ట్రంలోనూ ఇటువంటి విధానాలు అమలు చేస్తామని బృందం వెల్లడించింది.
గురువారం హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో జార్ఖండ్ రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ సీనియర్ అధికారుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను సీఎస్ సోమేశ్కుమార్ జార్ఖండ్ అధికారుల బృందానికి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరే వాణిజ్య పన్నుల శాఖ కూడా ఉన్నదని, ఆయన మార్గదర్శనంలో పన్నుల పరిపాలనలో అనేక మార్పు లు చేశామని చెప్పారు. ఫలితంగా.. ఆ శాఖ ద్వారా రాష్ట్ర ఆదాయం 2014లో రూ.23 వేల కోట్లు ఉంటే.. నిరుడు సుమారుగా 65 వేల కోట్లకు చేరిందని, దాదాపు మూడు రెట్లు పెరిగిందని తెలిపారు.
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పనితీరు గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉన్నదని జార్ఖండ్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్, అదనపు కమిషనర్లు సాయికిశోర్, కాశీ, జార్ఖండ్ వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి ఆరాధనా పట్నాయక్, కమిషనర్ సంతోష్కుమార్ వత్సతోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.