హైదరాబాద్ సిటీ బ్యూరో/మాదన్నపేట, జూన్ 20 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన క్షతగాత్రుల డిశ్చార్జి హైడ్రామాను తలపించింది. అగ్నిపథ్కు నిరసనగా ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలో పలువురు అభ్యర్థులు గాయపడి గాంధీలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బుల్లెట్ గాయాలకు గురైన నలుగురితో సహా మొత్తం 13 మంది క్షతగాత్రులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
బుల్లెట్ గాయాలైన బాధితులు మినహా మిగిలినవాళ్లు కోలుకోవటంతో వారిని ఆదివారం డిశ్చార్జి చేసేందుకు వైద్యాధికారులు సిద్ధమయ్యారు. డిశ్చార్జి అయిన వెంటనే వారిని అరెస్టు చేసేందుకు రైల్వే పోలీసులు సిద్ధం కావటంతో న్యాయపరమైన అంశాల కోసం క్షతగాత్రుల డిశ్చార్జి ప్రక్రియను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో సోమవారం మధ్యాహ్నం రైల్వే పోలీసులు గాంధీ వైద్యాధికారులతో చర్చలు జరిపి.. వారిని డిశ్చార్జి చేయించి, దవాఖానలోనే అదుపులోకి తీసుకొన్నారు. మీడియా కంటపడకుండా వెనుక గేట్ నుంచి తరలించారు.
క్షతగాత్రులను తరలిస్తున్న విషయం బయటికి తెలిస్తే ఆందోళనకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నదని బయటికి చెప్పలేదని పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, బుల్లెట్ గాయాలైన నలుగురికి వారం పాటు చికిత్స అవసరమని గాంధీ వైద్యులు తెలిపారు. ఛాతి, కాలు, తొడ భాగంలో బుల్లెట్ గాయాలైన ఇద్దరికి శస్త్రచికిత్స చేశామని, పెల్లెట్ గాయాలైన మరో ఇద్దరికి మైనర్ ఆపరేషన్లు నిర్వహించామని వెల్లడించారు. డిశ్చార్జి అయ్యాక వీరిని సైతం అదుపులోకి తీసుకొనేందుకు రైల్వే పోలీసులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
చంచల్గూడ జైలులో ములాఖాత్ల రద్దీ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో అరస్టై చంచల్గూడ జైల్లో ఉన్న 45 మంది ఆర్మీ అభ్యర్థులతో ములాఖాత్ కోసం వారి తల్లిదండ్రులు, కుటుంబీకులు భారీగా తరలివచ్చారు. సోమవారం 28 మంది యువకుల తల్లిదండ్రులు రావటంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసుతో తమ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని యువకుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు సికింద్రాబాద్కు వస్తున్నట్టు తెలియదని, వాళ్లు విధ్వంసానికి పాల్పడలేదని తెలిపారు. ఉద్యోగాలు వచ్చే సమయంలో ఇలా చేయరని, అన్యాయంగా అరెస్ట్ చేశారని కన్నీరుమున్నీరయ్యారు. ఘటనలో ప్రమేయమున్న వారిని వదిలేసి, విద్యార్థులను అరెస్ట్ చేశారని ఆరోపించారు.
సాయి డిఫెన్స్ అకాడమీలో ఐబీ, ఐటీ సోదాలు
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసానికి కారకుడని భావిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ అవుల సుబ్బారావు కార్యాలయంలో కేంద్ర ఇంటెలిజెన్స్, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీలో ఐబీ అధికారులు సోమవారం తనిఖీలు చేశారు. కార్యాలయంలో పత్రాల పరిశీనలతోపాటు సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. శిక్షణ పొందుతున్న యువకులు, ఫీజుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. సుబ్బారావును పోలీసులు డిఫెన్స్ అకాడమీకి తీసుకెళ్లి వివరాలు సేకరించారు.