Digital classes | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచి డిజిటల్ విద్యాబోధన అందుబాటులోకి రానున్నది. మన ఊరు -మన బడి, మన బస్తీ -మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రవేశ పెడుతున్నది. ఈ పథకంలో ఎంపికైన బడులకు డిజిటల్ విద్యాబోధనకు అవసరమయ్యే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లను చేరవేస్తున్నారు. రాష్ర్టానికి అవసరమైన 13,983 ప్యానళ్ల సేకరణకు టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. జూన్ కల్లా వీటిని బడులకు చేర్చి, తరగతి గదుల్లో ఏర్పాటు చేస్తారు. బడుల పునఃప్రారంభం అనంతరం విద్యార్థులకు ఈ ప్యానళ్ల ద్వారా టీచర్లు పాఠాలను బోధిస్తారు. దీంతో పాఠశాల విద్యాబోధన ఇక నుంచి కొత్త పుంతలు తొక్కనున్నది. తరగతి గదిలోనే పాఠ్యాంశాల తాలూకు వీడియోలు, చిత్రాలు ప్రదర్శితమవుతాయి. నిష్ణాతులు, సబ్జెక్టు నిపుణుల బోధనలు ఆడియోలు, వీడియోల్లో అందుబాటులోకి వస్తాయి. ఒకే పాఠాన్ని మళ్లీ వినే అవకాశం ఉంటుంది.
పాఠాల రూపకల్పనలో టిస్ సహకారం
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లతో బోధించే పాఠ్యాంశాల రూపకల్పనపై ఎస్సీఈఆర్టీ అధికారులు దృష్టి సారించారు. ఎస్సీఈఆర్టీలోని నిపుణుల బృందం డిజిటల్ పాఠ్యాంశాల రూపకల్పనపై కసరత్తును తీవ్రతరం చేసింది. ఇందుకు ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (టిస్) సహకారాన్ని తీసుకుంటున్నది. ఎస్సీఈఆర్టీ రూపొందించిన సిలబస్ను, దీక్ష పోర్టల్లోని పాఠ్యాంశాలను, ఇప్పటికే అమలులో ఉన్న క్యూఆర్ కోడ్ పాఠ్యాంశాలను తీసుకొని వాటిల్లో స్వల్ప మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఆడియో, వీడియోలను చేర్చడం, చిత్రాల కూర్పు చేపట్టారు.
ఏర్పాట్లు – ఉపయోగాలు